కోల్కతా: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న భారత స్టార్ క్రికెటర్ రిషబ్ పంత్ వచ్చే ఐపీఎల్ సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్కు కెప్టెన్గా వ్యవహరిస్తాడని ఆ జట్టు డైరెక్టర్ సౌరవ్ గంగూలీ పేర్కొన్నాడు. గురువారం ఢిల్లీ క్యాపిటల్స్ శిక్షణ శిబిరంలో పాల్గొన్న పంత్.. వచ్చే సీజన్ వరకు పూర్తి ఫిట్నెస్ సాధిస్తాడని దాదా ఆశాభావం వ్యక్తంచేశాడు.
‘పంత్ కోలుకుంటున్నాడు. వచ్చే ఐపీఎల్లో అతడు ఆడుతాడు. ప్రాక్టీస్ ప్రారంభించేందుకు అతడికి ఇంకొంత సమయం పడుతుంది. అతడు ఢిల్లీ సారథి. అందుకే జట్టు శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్నాడు’అని గంగూలీ అన్నాడు. కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ పంత్.. ఈ ఏడాది ఐపీఎల్తో పాటు టీమ్ఇండియా ఆడిన అన్నీ మ్యాచ్లకు దూరమయ్యాడు. అతడి గైర్హాజరీలో ఢిల్లీ క్యాపిటల్స్కు వార్నర్ సారథ్యం వహించిన విషయం తెలిసిందే.