Rishabh Pant : భారత జట్టు వికెట్ కీపర్ రిషభ్ పంత్(Rishabh Pant) చెమటోడ్చుతున్నాడు. ఫిట్నెస్ సాధించడం కోసం, తిరిగి జట్టులోకి రావడం కోసం శాయశక్తులా ప్రయత్నిస్తున్నాడు. ప్రస్తుతం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ (NCA)లో ఉన్న పంత్ కష్టమైన వ్యాయామాలు చేస్తున్నాడు. ఎక్సర్సైజ్ చేస్తున్న వీడియోలను ఈ డాషింగ్ బ్యాటర్ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాడు. అందులో ఒక వీడియోకు ‘ఆ దేవుడికి కృతజ్ఞతలు.. చిమ్మచీకటి ఉండే టన్నెల్లో వెలుగును చూడగలుగుతున్నా’ అని ఆసక్తికర క్యాప్షన్ రాశాడు. ఆ వీడియో ఇప్పుడు ఆన్లైన్లో వైరల్ అవుతోంది.
లోయర్ ఆర్డర్లో ధనాధన్ బ్యాటింగ్ చేసే పంత్ నిరుడు కారు యాక్సెడెంట్(Car Accident)తో ఆటకు దూరమయ్యాడు. ఆ తర్వాత ముంబైలో మోకాలి సర్జరీ చేయించుకున్న పంత్ ప్రస్తుతానికి ఎన్సీఏలో కోలుకుంటున్నాడు. మొదట్లో కర్రల సాయంతో నడిచిన పంత్ ఆ తర్వాత తేలికైన ఎక్సర్సైజ్లు చేశడు. ఇప్పుడు సైక్లింగ్, ఫాస్ట్ జాగింగ్ వంటివి చేస్తున్నాడు.
పంత్ దూరమైనప్పటి నుంచి టీమిండియాకు అతడిలా దూకుడుగా ఆడే వికెట్ కీపర్ దొరకలేదు. అయితే.. యంగ్స్టర్ ఇషాన్ కిషన్(Ishan Kishan) ఈమధ్య వరుస హాఫ్ సెంచరీలతో రాణిస్తూ పంత్ స్థానాన్ని భర్తీ చేసేలా కనిపిస్తున్నాడు. ఆసియా కప్(Asia Cup 2023)లో పాకిస్థాన్పై 82 రన్స్తో వారెవ్వా అనిపించాడు. దాంతో, ఈ లెఫ్ట్ హ్యాండర్కు వన్డే వరల్డ్ కప్లో చోటు దక్కడం ఖాయం అనిపిస్తోంది.