హైదరాబాద్, ఆట ప్రతినిధి: అత్యాధునిక వసతులతో హైదరాబాద్ గచ్చిబౌలిలో 82 ఎకరాల్లో యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని, ప్రపంచ స్థాయి స్పోర్ట్స్ అకాడమీని నిర్మిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. 2028 డిసెంబర్ నాటికి ఈ యూనివర్సిటీని ప్రారంభిస్తామని చెప్పారు.భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) అధ్యక్షురాలు పీటీ ఉషతో కలిసి గురువారం గచ్చిబౌలి స్పోర్ట్స్ డిస్ట్రిక్ట్ను ప్రారంభించడంతో పాటు స్పోర్ట్స్ యూనివర్సిటీ లోగోను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆరుగురు క్రీడాకారులకు రూ. 7.15 కోట్ల మేర నగదు ప్రోత్సాహకాలను సీఎం అందజేశారు. షూటర్ ఈషా సింగ్కు రూ. 3.3 కోట్లు, పారా అథ్లెట్ దీప్తి జీవాంజికి రూ. 50 లక్షలు, బధిర షూటర్ ధనుష్ శ్రీకాంత్ కు రూ. 2.10 కోట్లు, బాక్సర్ నిఖత్ జరీన్కు కు రూ. 60 లక్షలతో పాటు తనిష్క్ నాయుడు (షూటింగ్- రూ. 53.65 లక్షలు), సురభి భరద్వాజ్ (షూటింగ్-రూ. 10 లక్షలు) నగదు ప్రోత్సాహకాల చెక్కులు అందించారు.