IPL | బెంగళూరు: వరుస పరాభవాలతో ఐపీఎల్-18లో అందరికంటే ముందు ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించిన చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే).. మరోసారి గెలుపు ముంగిట బోల్తా కొట్టింది. చిన్నస్వామి వేదికగా చివరి బంతి వరకూ ఉత్కంఠగా సాగిన పోరులో ఆతిథ్య రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ).. చెన్నైని 2 పరుగుల తేడాతో ఓడించి మళ్లీ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి దూసుకొచ్చింది. బెంగళూరు నిర్దేశించిన 214 పరుగుల ఛేదనలో సీఎస్కే.. 20 ఓవర్లలో 211/5 వద్దే ఆగిపోయింది. ఆయుష్ మాత్రె (48 బంతుల్లో 94, 9 ఫోర్లు, 5 సిక్సర్లు) వీరవిహారానికి తోడు రవీంద్ర జడేజా (45 బంతుల్లో 77 నాటౌట్, 8 ఫోర్లు, 2 సిక్సర్లు) పోరాడినా ఆఖర్లో తడబడ్డ చెన్నైకి ఓటమి తప్పలేదు. మొదట బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ.. విరాట్ కోహ్లీ (33 బంతుల్లో 62, 5 ఫోర్లు, 5 సిక్సర్లు), జాకబ్ బెతెల్ (33 బంతుల్లో 55, 8 ఫోర్లు, 2 సిక్స్లు), రొమారియా షెపర్డ్ (14 బంతుల్లో 53 నాటౌట్, 4 ఫోర్లు, 6 సిక్స్లు) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 213/5 చేసింది.
లక్ష్యం చూస్తేనేమో కొండంత ఉంది. ఏడేండ్ల కాలంలో 185+ టార్గెట్ను ఛేదించే క్రమంలో చెన్నై విజయవంతమైన దాఖలాల్లేవు. దీంతో ఈ మ్యాచ్ కూడా కష్టమే? అనుకున్నారంతా. పవర్ ప్లేలోనే ఓపెనర్ రషీద్ (14)తో పాటు కరన్ (5) కూడా ఔట్ అవడంతో బెంగళూరు గెలుపు సంబురాలు చేసుకుంది. కానీ ఆయుష్ మాత్రం చెన్నైలో గెలుపు ఆశలు రేపాడు. బౌండరీతో పరుగుల వేటకు శ్రీకారం చుట్టిన 17 ఏండ్ల ఈ కుర్రాడు.. భువనేశ్వర్ వేసిన 4వ ఓవర్లో 4, 4, 4, 6, 4, 4తో 26 రన్స్ రాబట్టాడు. జడేజా అండగా అతడు చెన్నై స్కోరుబోర్డును పరుగులు పెట్టిస్తూ లక్ష్యాన్ని వడివడిగా కరిగించాడు. సుయాశ్ బౌలింగ్లో మిడ్వికెట్ దిశగా సింగిల్ తీసిన ఆయుష్.. ఈ లీగ్లో తొలి అర్ధశతకాన్ని నమోదుచేశాడు.
షెపర్డ్ పదో ఓవర్లో రెండు సిక్సర్లు, బౌండరీ దంచడంతో చెన్నై వంద పరుగుల మార్కును దాటింది. జడ్డూ కూడా బౌండరీలతో కదం తొక్కి 29 బంతుల్లో హాఫ్ సెంచరీ మార్కును అందుకున్నాడు. ఆయుష్ 94 రన్స్ వద్ద ఎంగిడి బౌలింగ్లో కృనాల్కు క్యాచ్ ఇచ్చి సెంచరీని జారవిడుచుకున్నాడు. మరుసటి బంతికే బ్రెవిస్ కూడా ఎల్బీగా వెనుదిరగడంతో చెన్నై అభిమానుల్లో టెన్షన్ మొదలైంది. ఆఖరి ఓవర్లో ఆ జట్టు విజయానికి 15 పరుగులు అవసరమనగా.. దయాల్ అద్భుతంగా బౌలింగ్ చేసి 12 పరుగులే ఇవ్వడంతో సీఎస్కే ఓటమివైపు నిలిచింది.
ఓపెనర్లు కోహ్లీ, బెతెల్ బెంగళూరు ఇన్నింగ్స్ను దూకుడుగా ఆరంభిస్తే ఆఖర్లో షెఫర్డ్ ఖతర్నాక్ ఫినిషింగ్ ఇచ్చాడు. నిఖార్సైన పేసర్ లేని చెన్నై బౌలింగ్పై బెంగళూరు ఓపెనింగ్ జోడీ ఆరంభం నుంచే ఎదురుదాడికి దిగడంతో స్కోరు వేగం రాకెట్ వేగాన్ని తలపించింది. బెతెల్, కోహ్లీ బౌండరీలు, సిక్సర్లతో దండెత్తడంతో పవర్ ప్లేలోనే ఆ జట్టు స్కోరు వికెట్ నష్టపోకుండా 71 పరుగులకు చేరింది. 27 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద బెతెల్ ఇచ్చిన క్యాచ్ను సీఎస్కే జారవిడవడంతో బతికిపోయిన అతడు.. ఆ తర్వాత వీరబాదుడు బాదాడు. 28 బంతుల్లో ఈ కుర్రాడి అర్ధ శతకం పూర్తయింది. పదో ఓవర్లో బంతినందుకున్న పతిరాన.. బెతెల్ను ఔట్ చేసి ఎట్టకేలకు ఈ జోడీని విడదీశాడు. 9.5 ఓవర్లలోనే ఈ ద్వయం 97 పరుగులను జోడించడం విశేషం.
జడేజా బౌలింగ్లో బౌండరీతో కోహ్లీ కూడా ఈ సీజన్లో ఏడో హాఫ్ సెంచరీని నమోదుచేశాడు. కానీ సామ్ కరన్ ఓవర్లో కోహ్లీ ఔట్ అవడం.. అదే సమయంలో చెన్నై బౌలర్లు కట్టడి చేయడంతో బెంగళూరు స్కోరుబోర్డు వేగం తగ్గింది. మిడిలార్డర్లో పడిక్కల్ (17), రజత్ (11), జితేశ్ (7) వేగంగా ఆడలేకపోయారు. 18వ ఓవర్లో పటీదార్ నిష్క్రమించే సమయానికి బెంగళూరు స్కోరు 159/5 మాత్రమే. ఆర్సీబీ 170-180 చేస్తే గొప్ప అనుకున్నారంతా. కానీ కండల్లో కరెంట్ నింపుకుని వచ్చాడో ఏమో గానీ క్రీజులోకి వచ్చిన షెపర్డ్.. ఖలీల్ వేసిన 19వ ఓవర్లో 6, 6, 4, 6, 6 (నోబాల్), 4తో ఏకంగా 33 పరుగులు పిండుకున్నాడు. పతిరాన ఆఖరి ఓవర్లోనూ అతడు..4, 4, 6, 6 తో 14 బంతుల్లోనే హాఫ్ సెంచరీని పూర్తిచేశాడు.
బెంగళూరు: 20 ఓవర్లలో 213/5 (కోహ్లీ 62, బెతెల్ 55, పతిరాన 3/36, నూర్ 1/26);
చెన్నై: 20 ఓవర్లలో 211/5 (ఆయూష్ 94, జడేజా 77*, ఎంగి 3/30, కృనాల్ 1/24)