టీమిండియా కెప్టెన్గా అరుదైన విజయాలు సాధించిన మహేంద్రసింగ్ ధోనీపై జట్టు ప్రస్తుత కోచ్ రవిశాస్త్రి ప్రశంసల వర్షం కురిపించాడు. కెప్టెన్సీ విషయంలో ధోనీకి సమీపంలో కూడా ఎవరూ లేరని రవిశాస్త్రి అన్నాడు. పరిమిత ఓవర్ల క్రికెట్లో ధోనీతో పోల్చగల కెప్టెన్ మరెవరూ లేరని తేల్చేశాడీ టీమిండియా హెడ్ కోచ్. ’’ధోనీ అత్యంత గొప్ప వైట్ బాల్ కెప్టెన్. ఐసీసీ టోర్నీల్లో ఒకసారి అతని రికార్డు చూడండి. అసలు అతను గెలవనిదేంటి? ఐపీఎల్లు, ఛాంపియన్ లీగ్లు, అన్ని ఐసీసీ టోర్నీలు, రెండు ప్రపంచ కప్లు. కాబట్టి పరిమిత ఓవర్ల కెప్టెన్సీలో అతని దరిదాపుల్లో కూడా ఎవరూ లేరు‘‘ అని రవిశాస్త్రి చెప్పాడు.
అతను అందరికన్నా గొప్పోడని, ధోనీని ’కింగ్ కాంగ్ అని పిలవాలని సూచించాడు. ధోనీ ఒక జట్టుకు నాయకత్వం వహిస్తుంటే ఒకరకమైన ప్రశాంతత, అంతా నియంత్రణలోనే ఉందనే భావన ఉంటుందని రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. ప్రత్యర్థి జట్టు భారీ షాట్లతో విరుచుకుపడుతున్నా సరే, ధోనీ జట్టులో ఒక హుందాతనం కనిపిస్తుందని కితాబిచ్చాడు.
ఈ నెల 17 నుంచి ప్రారంభమయ్యే టీ20 ప్రపంచకప్లో టీమిండియా మెంటార్గా ధోనీ సేవలందించనున్న సంగతి తెలిసిందే. అయితే ఈ టోర్నీ తర్వాత రవిశాస్త్రి తన కోచ్ పదవి నుంచి తప్పుకుంటాడని వార్తలు వస్తున్నాయి.