Rashid Khan : పురుషుల టీ20 ప్రపంచకప్ లీగ్ మ్యాచ్కు ముందు అఫ్గనిస్థాన్ కెప్టెన్ రషీద్ ఖాన్ (Rashid Khan) సంచలన వ్యాఖ్యలు చేశాడు. ప్రభుత్వ ఆంక్షలతో విదేశాల్లో తలదాచుకుంటున్ను తమ దేశ మహిళా క్రికెటర్లకు అతడు మద్దతు తెలిపాడు. న్యూజిలాండ్తో మ్యాచ్ సన్నద్ధతపై మాట్లాడిన రషీద్ను మీరు అఫ్గనిస్థాన్ మహిళా క్రికెటర్లకు మద్దతిస్తారా?అని విలేకరులు ప్రశ్నించారు. అందుకు రషీద్ ఖాన్ కచ్చితంగా మద్దతిస్తాను అని బదులిచ్చాడు.
ఐదేళ్ల క్రితం అఫ్గనిస్థాన్లో తాలిబాన్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మహిళల హక్కులు హరించిపోయాయి. విద్యావంతులు, మేధావులు, మహిళా క్రికెటర్లు విదేశాల్లో తలదాచుకుంటున్నారు. ప్రభుత్వం ఆంక్షల నేపథ్యంలో పలువురు అమ్మాయిలు, మహిళలు క్రికెట్ ఆశను చంపుకొని బతికేస్తున్నారు. తమ అభిరుచిని గౌరవించి.. ఆడేందుకు అనుమతివ్వాలని వారు కోరుతున్నారు. ఇటీవలే పురుష క్రికెటర్లు బహిరంగంగా మద్దతు తెలపాలని మహిళా ప్లేయర్ ఫిరూజా అమిరి అభ్యర్థించింది. దాంతో.. ప్రపంచకప్ వేదికను మించిన బిగ్ స్టేజ్ ఉంటుందా? అనుకున్నాడేమో నాకేం అభ్యంతరం లేదని రషీద్ ఖాన్ పేర్కొన్నాడు.
Rashid Khan on Afghanistan Women’s team: 🗣
“We would love see anyone representing Afghanistan in any stage it’s huge and proud moment. But it’s all about decision to be taken by ACB and ICC. As player you don’t have much control.” pic.twitter.com/Tz95PFw8BF
— ACB Xtra (@acb_190) February 7, 2026
‘అఫ్గనిస్థాన్ మహిళల జట్టు కచ్చితంగా ఆడాలి. ఐసీసీ పూర్తి సభ్యత్వం కలిగిన జట్టుగా గుర్తించాలి. ఈ విషయం ఐసీసీకి, అఫ్గన్ క్రికెట్ బోర్డుకు తెలుసు. ఏ వేదికపై అయినా.. ఎవరైనా అఫ్గనిస్థాన్కు ప్రాతినిధ్యం వహిస్తున్నారంటే చాలా సంతోషం. నిజంగా అది మాకు గర్వపడాల్సిన సందర్భం. అయితే ఈ అంశంపై అఫ్గనిస్థాన్ క్రికెట్ బోర్డు, ఐసీసీ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఆటగాళ్లుగా మేము ఇందులో ఏం చేయలేం. ప్రస్తుతమున్న పరిస్థితుల్లో మేము చేయగలిగేది చాలా తక్కువే. అధికారంలో ఉన్నవారు ఈ విషయాన్ని మందుకు తీసుకెళ్తారని ఆశిస్తున్నా’ అని ప్రీ-మ్యాచ్ మీడియా సమావేశంలో కాబూలీ సారథి వెల్లడించాడు.
శరణార్ధులుగా విదేశాల్లో నివసిస్తున్న అఫ్గనిస్థాన్ మహిళా క్రికెటర్లకు అండగా నిరుడు ఐసీసీ కీలక నిర్ణయం తీసుకుంది. భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమిచ్చిన వన్డే ప్రపంచకప్ మ్యాచ్లను వీక్షించే అవకాశం కల్పించింది. అంతేకాదు బీసీసీఐ, ఇంగ్లండ్ బోర్డు, ఆస్ట్రేలియా బోర్డు సహకారంతో అఫ్గన్ మహిళా క్రికెటర్లకు శిక్షణ శిబిరాలు, దేశవాళీ మ్యాచ్లు ఆడించాలని తీర్మానించింది.