కాబూల్: ఆఫ్ఘనిస్థాన్ ( Afghanistan )లో అమెరికా సంకీర్ణ సేనలు ప్రవేశించిన తర్వాత ఈ రెండు దశాబ్దాల్లో ఆ దేశం తాలిబన్ల నుంచి స్వేచ్ఛా వాయువులు పీల్చడంతోపాటు అక్కడి క్రికెట్ కూడా ఎంతో పురోగతి సాధించింది. రషీద్ ఖాన్లాంటి వరల్డ్క్లాస్ స్పిన్ బౌలర్ ఆ దేశం నుంచి వచ్చి అంతర్జాతీయ క్రికెట్లో సంచలనాలు సృష్టిస్తున్నాడు. కానీ ఇప్పుడా దేశం మళ్లీ తాలిబన్ల చేతుల్లోకి వెళ్లిపోవడంతో అక్కడి క్రికెటర్లు భవిష్యత్తు గందరగోళంలో పడిపోయింది. స్టార్ క్రికెటర్లు రషీద్ ఖాన్, మహ్మద్ నబీలాంటి వాళ్లు ఇప్పుడు వచ్చే నెలలో జరిగే ఐపీఎల్లో అయినా ఆడతారా లేదా అన్నది అనుమానంగా మారింది.
ఈ ఇద్దరు క్రికెటర్లు ప్రస్తుతం ఆఫ్ఘనిస్థాన్లో లేరు. హండ్రెడ్ టోర్నీలో ఆడటానికి యూకేలో ఉన్నారు. రషీద్ ట్రెంట్ రాకెట్స్కు, నబీ లండన్ స్పిరిట్స్కు ఆడుతున్నారు. అయితే వీళ్లు అక్కడి నుంచి నేరుగా యూఏఈ వచ్చి ఐపీఎల్లో పాల్గొంటారా లేదా అన్నదానిపై స్పష్టత లేదు. వాళ్లు వస్తారన్న నమ్మకం తమకు ఉన్నదని బీసీసీఐ చెబుతోంది. ఇప్పుడే దీనిపై కామెంట్ చేయలేం. అయితే పరిస్థితులను గమనిస్తున్నాం. మా వరకూ ఏ మార్పులూ లేవు. రషీద్తోపాటు ఇతర ప్లేయర్స్ ఐపీఎల్లో పాల్గొంటారు అని బీసీసీఐ వర్గాలు తెలిపాయి.
ఈ నెల 21న హండ్రెడ్ టోర్నీ ముగుస్తోంది. ఆ తర్వాత కూడా రషీద్, నబీ యూకేలోనే ఉంటారా లేదా అన్నదానిపై స్పష్టత లేదు. ఒకవేళ వాళ్లు యూకేలోనే ఉంటే.. ఆ క్రికెటర్లను మన వాళ్లతో కలిపి ఒకే విమానంలో తీసుకువచ్చే ప్రయత్నం బీసీసీఐ చేయవచ్చు. రషీద్, నబీ ఇద్దరూ ఐపీఎల్లో సన్రైజర్స్ హైదరాబాద్ టీమ్కు ఆడుతున్నారు. ఆఫ్ఘనిస్థాన్లో పరిస్థితిపై అక్కడి క్రికెట్ బోర్డుతో బీసీసీఐ మాట్లాడనుంది. అంతేకాదు ఈ నెలలోనే ఆఫ్ఘనిస్థాన్ టీమ్ శ్రీలంక టూర్ కూడా వెళ్లాల్సి ఉంది. ఇప్పటికే తమ దేశాన్ని రక్షించాలంటూ రషీద్ ఖాన్ ట్వీట్ చేసిన విషయం తెలిసిందే.