Ranji Trophy : డిఫెండింగ్ ఛాంపియన్ మధ్యప్రదేశ్ రంజీ ట్రోఫీ సెమీఫైనల్లో అడుగు పెట్టింది. క్వార్టర్ ఫైనల్లో ఆంధ్రాపై ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఓపెనర్ యశ్ దూబే, రజత్ పాటిదార్ అర్థ శతకాలతో రాణించారు. ఇండోర్లో జరిగిన మ్యాచ్లో 245 టార్గెట్తో బరిలోకి దిగిన మధ్యప్రదేశ్కు ఓపెనర్లు శుభారంభం ఇచ్చారు. గురువారం ఆట ముగిసే సరికి ఆ జట్టు వికెట్ నష్టపోకుండా 58 పరుగులు చేసింది. అయితే.. శుక్రవారం ఆట ఆరంభమైన వెంటనే ఓపెనర్ హిమాన్షు మంత్రి (31) ఔటయ్యాడు. ఆ తర్వాత మరో ఓపెనర్ దూబే, శుభం శర్మ (40)తో కలిసి రెండో వికెట్కు 62 రన్స్ జోడించాడు. రజత్ పాటిదార్ హఫ్ సెంచరీ కొట్టడంతో మధ్యప్రదేశ్ విజయం సులువైంది. చివర్లో సరన్ష్ జైన్, హర్ష గవ్లితో కలిసి జట్టును గెలిపించాడు. ఈ విజయంతో మధ్యప్రదేశ్ సెమీఫైనల్లో బెంగాల్ జట్టుతో అమీతుమీకి సిద్ధమైంది. ఫిబ్రవరి 8న సెమీస్ పోరు జరగనుంది.
విహరి అద్వితీయ పోరాటం
మొదట బ్యాటింగ్ చేసిన ఆంధ్రా తొలి ఇన్నింగ్స్లో 379కి పరిమితమైంది. మధ్యప్రదేశ్ 228 రన్స్కే ఆలౌట్ కావడంతో ఆంధ్రాకు 151 పరుగుల ఆధిక్యం లభించింది. అయితే.. రెండో ఇన్నింగ్స్లో ఆ జట్టు 32.3 ఓవర్లలో 93 రన్స్కే పరిమితం అయింది. రెండో ఇన్నింగ్స్లో ఆంధ్రా జట్టు కెప్టెన్ హనుమా విహరి అద్వితీయ పోరాటం కనబరిచాడు. మణికట్టు గాయంతో రిటైర్డ్ హట్గా మైదానం వీడిన అతను పదో వికెట్గా వచ్చాడు. ఎడమచేతితో బ్యాటింగ్ చేసి 16 రన్స్ వద్ద ఔట్ అయ్యాడు.