కోల్కతా: ప్రతిష్ఠాత్మక రంజీ ట్రోఫీలో సౌరాష్ట్ర టైటిల్తో తళుక్కుమంది. చారిత్రక ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచ్లో సౌరాష్ట్ర 9 వికెట్ల తేడాతో బెంగాల్పై ఘన విజయం సాధించింది. బెంగాల్ నిర్దేశించిన 12 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని సౌరాష్ట్ర..గోహిల్(0) వికెట్ కోల్పోయి 2.4 ఓవర్లలో లక్ష్యాన్ని అందుకుంది. అంతకుముందు ఓవర్నైట్ స్కోరు 169/4 నాలుగో రోజు రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన బెంగాల్..సీనియర్ స్పీడ్స్టర్ జైదేవ్ ఉనాద్కట్(6/85) ధాటికి 241 పరుగులకు కుప్పకూలింది. ఓవర్నైట్ బ్యాటర్లు కెప్టెన్ మనోజ్ తివారీ(68), షాబాజ్ అహ్మద్(27) తొందరగానే వెనుదిరిగారు. ఉనాద్కట్ పేస్ విజృంభణతో బెంగాల్ వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది. ఆఖర్లో ఇషాన్ పోరెల్(22) దూకుడుగా ఆడే ప్రయత్నం చేసినా లాభం లేకపోయింది. గత 10 సీజన్లలో ఐదుసార్లు ఫైనల్స్కు చేరిన సౌరాష్ట్ర రెండోసారి రంజీ విజేతగా నిలిచింది. మరోవైపు చివరిసారి 1989-90లో రంజీ గెలిచిన బెంగాల్కు మరోమారు నిరాశే ఎదురైంది.