గువాహటి: క్రీజులోకి దిగితే బౌలర్ ఎవరన్నదీ లెక్కచేయకుండా బంతిని బౌలర్ల చేతుల్లో కంటే బౌండరీ లైన్ ఆవలే ఎక్కువసేపు ఉంచుతున్న వండర్కిడ్ వైభవ్ సూర్యవంశీ (26 బంతుల్లో 78, 8 ఫోర్లు, 7 సిక్స్లు) మరోసారి ఆకాశమే హద్దుగా చెలరేగడంతో రాజస్థాన్ రాయల్స్ ఈ సీజన్లో వరుసగా నాలుగో విజయాన్ని నమోదుచేసింది. వైభవ్తో పాటు ధృవ్ జురెల్ (43 బంతుల్లో 81 నాటౌట్, 8 ఫోర్లు, 3 సిక్స్లు) మరో మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్తో ఆ జట్టు.. గువాహటిలో డిఫెండింగ్ చాంపియన్స్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరును 6 వికెట్ల తేడాతో ఓడించి అగ్రస్థానాన్ని మరింత పటిష్టం చేసుకుంది. మొదట బ్యాటింగ్కు వచ్చిన ఆర్సీబీ.. రజత్ పాటిదార్ (40 బంతుల్లో 63, 4 ఫోర్లు, 4 సిక్స్లు) కెప్టెన్ ఇన్నింగ్స్కు తోడు కోహ్లీ (16 బంతుల్లో 32, 7 ఫోర్లు), వెంకటేశ్ అయ్యర్ (15 బంతుల్లో 29 నాటౌట్, 1 ఫోర్, 2 సిక్స్లు) రాణించడంతో 8 వికెట్ల నష్టానికి 201 రన్స్ సాధించింది.
రాయల్స్ విజయంలో వైభవ్ విన్యాసాలే హైలైట్. పవర్ ప్లేలో అతడు జురెల్ అండగా ఆర్సీబీ బౌలర్లపై నిర్ధాక్షిణ్యంగా విరుచుకుపడటంతో ఛేదనను రాజస్థాన్ ధాటిగా ఆరంభించింది. ముంబైతో మ్యాచ్లో బుమ్రా, బౌల్ట్ వంటి బౌలర్ల భరతం పట్టిన వైభవ్.. ఈ సీజన్లో తొలి మ్యాచ్ ఆడిన ఆసీస్ అగ్రశ్రేణి పేసర్ జోష్ హాజిల్వుడ్కూ తన బ్యాటింగ్ ప్రతాపాన్ని రుచి చూపించాడు. జైస్వాల్ (13) త్వరగానే నిష్క్రమించినా భువీ తొలి ఓవర్లో రెండు బౌండరీలతో దంచుడుకు ముహూర్తం పెట్టిన వైభవ్.. మూడో ఓవర్ విసిరిన అభినందన్కు రెండు ఫోర్లు, సిక్స్తో స్వాగతం పలికాడు. ఆ తర్వాత బాధితుడు హాజిల్వుడే. ఆ ఓవర్లో హ్యాట్రిక్ ఫోర్లకు తోడు డీప్ స్కేర్ లెగ్ మీదుగా బాదిన సిక్స్తో 19 రన్స్ వచ్చాయి.
అదే ఊపులో ఈ బీహార్ కుర్రాడు భువీ ఓవర్లో రెండు భారీ సిక్స్లతో 15 బంతుల్లోనే ఈ సీజన్లో రెండో అర్ధశతకాన్ని సాధించాడు. పవర్ ప్లే ఆఖరు ఓవర్ వేసిన అభినందన్ ఓవర్లో జురెల్.. 4, 6, 4, 6, 4 బాదడంతో ఆరు ఓవర్లకు ఆతిథ్య జట్టు 97/1తో తిరుగులేని స్థితిలో నిలిచింది. డేవిడ్ ఓవర్లో రెండు సిక్స్లతో రెచ్చిపోయిన వైభవ్.. కృనాల్ 9వ ఓవర్లో లాంగాన్లో కోహ్లీ చేతికి చిక్కడంతో 108 పరుగుల (37 బంతుల్లోనే) రెండో వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. కానీ అప్పటికే రాజస్థాన్ విజయం దాదాపుగా ఖాయమైంది. హెట్మెయర్, కెప్టెన్ పరాగ్ విఫలమైనా జురెల్.. రవీంద్ర జడేజా (24*) అండతో లాంఛనాన్ని పూర్తిచేశాడు. జడ్డూ, జురెల్ జోడీ ఐదో వికెట్కు 68 రన్స్ జోడించింది.
వర్షం కారణంగా గంట ఆలస్యంగా ఆరంభమైన మ్యాచ్లోమొదట బ్యాటింగ్ చేసిన ఆర్సీబీకి టాపార్డర్ నిరాశపరిచినా రజత్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. తన వరుస ఓవర్లలో ఆర్చర్.. సాల్ట్ను, మూడు బౌండరీలతో జోరు మీద కనిపించిన పడిక్కల్ (14)ను ఔట్ చేయడంతో పర్యాటక జట్టు ప్రారంభంలోనే రెండు వికెట్లు కోల్పోయింది. ఏడు ఫోర్లతో దూకుడుగానే ఆడిన కోహ్లీ.. బిష్ణోయ్ ఐదో ఓవర్లో క్లీన్బౌల్డ్ అయ్యాడు. అదే ఊపులో రాజస్థాన్ బౌలర్లు.. కృనాల్ (1), జితేశ్ (5), డేవిడ్ (13)ను పెవిలియన్కు పంపడంతో ఆర్సీబీ 11 ఓవర్లకు 94/6తో పీకల్లోతు కష్టాల్లో నిలిచింది. ఈ క్రమంలో రజత్.. షెఫర్డ్ (22), వెంకటేశ్ అండగా కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఈ త్రయం.. ఆఖరి ఓవర్లలో రాజస్థాన్ బౌలర్లపై ఎదురుదాడికి దిగి ఆ జట్టు భారీ స్కోరుకు బాటలు వేశారు.
బెంగళూరు: 20 ఓవర్లకు 201/8 (రజత్ 63, కోహ్లీ 32, బిష్ణోయ్ 2/32, ఆర్చర్ 2/33);
రాజస్థాన్: 18 ఓవర్లకు 202/4 (జురెల్ 81*, వైభవ్ 78, కృనాల్ 2/30, హాజిల్వుడ్ 2/44)
