Rahul Dravid | టీ20 వరల్డ్కప్ (T20 World Cup 2024) విజేతగా నిలిచిన టీమ్ఇండియాకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) భారీ నజరానా ప్రకటించిన విషయం తెలిసిందే. 13 ఏండ్ల తర్వాత ఐసీసీ ట్రోఫీ సాధించడంతో ఆటగాళ్లతోపాటు సహాయక సిబ్బందికి రూ.125 కోట్ల నగదు బహుమతిని ప్రకటించింది. ఇటీవల వాంఖడే స్టేడియంలో నిర్వహించిన కార్యక్రమంలో దీనికి సంబంధించిన చెక్కును కూడా అందజేసింది.
స్క్వాడ్లోని 15 ప్లేయర్లకు రూ.5 కోట్లు చొప్పున, రిజర్వ్ ఆటగాళ్లకు రూ. కోటి చొప్పున అందించింది. ప్రధాన కోచ్గా బాధ్యతలు నిర్వర్తించిన రాహుల్ ద్రవిడ్కూ రూ.5 కోట్ల బోనస్ దక్కింది. అయితే బోనస్ విషయంలో రాహుల్ ద్రవిడ్ (Rahul Dravid) కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. బోనస్ (bonus)లో సగం అమౌంట్ను తగ్గించాలని బీసీసీఐని కోరినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. తన సహాయ కోచింగ్ స్టాఫ్తో సమానంగానే బోనస్ పంచుకోవాలని ద్రవిడ్ భావిస్తున్నట్లు బీసీసీఐ అధికార వర్గాలు వెల్లడించాయి. బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్, ఫీల్డింగ్ కోచ్ దిలీప్, బౌలింగ్ కోచ్ పరాస్ మాంబ్రేతో సమానంగానే తనకు కూడా రూ.2.5 కోట్లే ఇవ్వాలని కోరినట్లు పేర్కొన్నాయి.
టీ20 వరల్డ్ కప్ గెలిచిన టీమ్ఇండియా జట్టుకు బీసీసీఐ రూ.125 కోట్ల ప్రైజ్ మనీ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మొత్తాన్ని ఆటగాళ్లు, సహాయక సిబ్బంది, కోచ్లు, సెలెక్టర్లందరికి పంచుతామని బీసీసీఐ ప్రధాన కార్యదర్శి జైషా ఇప్పటికే ప్రకటించారు. దీంతోపాటు భారత జట్టు స్వదేశానికి చేరుకున్న తర్వాత ముంబైలో నిర్వహించిన కార్యక్రమంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే.. టీమ్ ఇండియాకు రూ.11 కోట్లు ప్రకటించారు. దానిని అందరికి పంచనున్నారు. ప్రపంచకప్లో పాల్గొనేందుకు ఆటగాళ్లు, సహాయక సిబ్బంది, రిజర్వ్ ఆటగాళ్లు, ఇతర సిబ్బంది మొత్తం 42 మంది అమెరికా, వెస్టిండీస్ వెళ్లారు. వారిలో 15 మంది జట్టు సభ్యులతోపాటు హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ ఒక్కొక్కరూ రూ.5 కోట్ల ప్రైజ్ మనీని ప్రకటించింది.
కోచింగ్ స్టాఫ్కు 2.5 కోట్లు
ఇక ద్రవిడ్ కోచింగ్ స్టాఫ్ విషయానికి వస్తే.. బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్, ఫీల్డింగ్ కోచ్ దిలీప్, బౌలింగ్ కోచ్ పరాస్ మాంబ్రేకు రూ.2.5 కోట్ల చొప్పున, సహాయక సిబ్బందిలో ముగ్గురు ఫిజియోథెరపిస్ట్లు, ముగ్గురు త్రోడౌన్ స్పెషలిస్టులు, ఇద్దరు మసాజర్లు, స్ట్రెంగ్త్ అండ్ కండిషనింగ్ కోచ్లకు ఒక్కొక్కరికి రూ.2 కోట్లు అందజేస్తారు. చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్తోసహా సెలక్షన్ కమిటీ సభ్యులకు ఒక్కొక్కరికి రూ.కోటి ఇస్తారు. వీరితోపాటు రిజర్వ్ ఆటగాళ్లుగా వెళ్లిన రింకు సింగ్, శుభ్మన్ గిల్, అవేశ్ ఖాన్, ఖలీల్ అహ్మద్లకు రూ.కోటి చొప్పున అందజేయనున్నారు.
Also Read..
PM Modi | 41 ఏళ్ల తర్వాత ఆస్ట్రియాలో అడుగుపెట్టిన భారత ప్రధాని.. సెల్ఫీ ఫొటోలు షేర్ చేసిన మోదీ
Assam Floods | వరదలకు అస్సాం అతలాకుతలం.. 92కు పెరిగిన మృతులు
Kedarnath MLA | కేదార్నాథ్ బీజేపీ ఎమ్మెల్యే శైలా రాణి మృతి