Rahul Dravid : పొట్టి ప్రపంచకప్ ముందు టీమిండియా(Team India) ఆఖరి టీ20 సిరీస్ ఆడేసింది. ఆ సిరీస్లో యువ క్రెకెటర్లు ఇషాన్ కిషన్(Ishan Kishan), రిషభ్ పంత్(Rishabh Pant)లకు చోటు దక్కకపోవడంతో.. వాళ్లకు టీ20 వరల్డ్ కప్ జట్టులో చాన్స్ లేనట్టేననే వార్తలు వ్యాపించాయి. ఈ నేపథ్యంలో భారత హెడ్కోచ్ రాహుల్ ద్రవిడ్(Rahul Dravid) టీ20 వరల్డ్కప్ స్క్వాడ్పై హింట్ ఇచ్చాడు.
కుర్రాళ్లు ఇషాన్, పంత్లు తమ దృష్టిలో ఉన్నారని అన్నాడు. ఇక వికెట్ కీపర్ల విషయానికొస్తే కేఎల్ రాహుల్తో పాటు సంజూ శాంసన్ పేర్లు తమ పరిశీలనలో ఉన్నాయని ద్రవిడ్ తెలిపాడు. ‘మాకు వికెట్ కీపింగ్ ఆప్షన్లు చాలా ఉన్నాయి. అఫ్గనిస్థాన్ సిరీస్(Afghanistan Series)లో ఆడిన సంజూ శాంసన్, జితేశ్ శర్మలతో పాటు రాహుల్, రిషభ్ పంత్, ఇషాన్ కిషన్లు టీ20 వరల్డ్ కప్ టోర్నీకి అందుబాటులో ఉన్నారు. అయితే.. టీ20 ప్రపంచకప్ పోటీలకు కొన్ని నెలలు ఉంది. ఆలోపు ఉత్తమ కీపర్లను ఎంపిక చేస్తాం’ అని ద్రవిడ్ వెల్లడించాడు.
పంత్, ఇషాన్, శాంసన్, రాహుల్
దక్షిణాఫ్రికా పర్యటనకు ఎంపికైన ఇషాన్ అర్ధాంతరంగా స్వదేశానికి వచ్చాడు. అయితే.. క్రమశిక్షణ చర్యల్లో భాగంగానే అతడిని అఫ్గనిస్థాన్, ఇంగ్లండ్ సిరీస్లో తొలి రెండు టెస్టులకు తీసుకోలేదని వార్తలు వినిపించాయి. మరోవైపు కారు యాక్సెంట్కు గురైన పంత్ మోకాలి సర్జరీ నుంచి వేగంగా కోలుకుంటున్నాడు. ఈ స్టార్ వికెట్ కీపర్ 17వ సీజన్ ఐపీఎల్తో రీ ఎంట్రీ ఇచ్చే చాన్స్ ఉంది. మరోవైపు అఫ్గనిస్థాన్ సిరీస్లో రాణించిన శాంసన్, యువకెరటం ధ్రువ్ జురెల్(Dhruv Jurel) కూడా వికెట్ కీపర్ స్థానానికి పోటీ పడుతున్నారు.
ధ్రువ్ జురెల్, ఇషాన్
ఈ ఇద్దరికి ఇంగ్లండ్తో రెండు టెస్టుల స్క్వాడ్లో చోటు దక్కింది. దాంతో, ఈ సిరీస్ అనంతరం వరల్డ్ కప్ జట్టుకి ఎంపికయ్యే కీపర్లు ఎవరో తేలిపోనుంది. సొంతగడ్డపై వన్డే వరల్డ్ కప్ను చేజార్చుకున్న భారత్.. టీ20 ప్రపంచకప్పై గురి పెట్టింది. వెస్టిండీస్, అమెరికా సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న ఈ మెగా టోర్నీలో ట్రోఫీ గెలిచి 11 ఏండ్ల ఐసీసీ ట్రోఫీ నిరీక్షణకు తెరదించాలనే కసితో ఉంది.