బంట్వారం, జులై 2 : గ్రామాల్లో పచ్చదనం, పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ పౌసుమి బసు అన్నారు. ‘పల్లె ప్రగతి’లో భాగంగా మండల పరిధిలోని తొరుమామిడి గ్రామంలో శుక్రవారం ఆమె పర్యటించారు. పల్ల్లె ప్రకృతి వనం, కమ్మూనిటీ ప్లాంటేషన్, కాంపోస్టు షెడ్డు, నర్సరీ, శ్మశాన వాటికలను పరిశీలించారు. గ్రామస్తులను అడిగి సమస్యలు తెలుసుకున్నారు. ప్రధానంగా గ్రామ పంచాయతీ ఆదాయ వనరులు మెరుగుపర్చుకోవాలన్నారు. నాటే మొక్కలు ముందు తరాలకు ఉపయోగపడేలా ఉండాలన్నారు. పచ్చదనం పెంపుపై సంతృప్తి వ్యక్తం చేస్తూ గ్రామ సర్పంచ్, సిబ్బందిని అభినందించారు. గ్రామంలో క్రమం తప్పకుండా పారిశుధ్య నిర్వహణ చేపట్టాలని సూచించారు. మురుగు కాలువల దుస్థితిని ప్రజలు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పల్లె ప్రగతి కార్యక్రమం ఒక్క రోజుతో అయిపోయేది కాదని, అధికారులు దశలవారీగా అన్ని సమస్యలను పరిష్కరిస్తారన్నారు. ప్రజలు తమ ఇండ్ల నుంచి వచ్చే తడి, పొడి చెత్తను వేరు చేసి ఇవ్వాలన్నారు.
ప్రతి ఇంటికీ మిషన్ భగీరథ నీరు అందుతున్నదా లేదా అని ఆరా తీశారు. నీటి ట్యాంకుల వద్ద మురుగునీరు నిల్వ ఉండడం, పాచి పేరుకుపోవడాన్ని గమనించిన కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్సీకాలనీలో వర్షపు నీటితోపాటు మురుగు నీరు ఇండ్లలోకి వస్తుందని స్థానికులు ఆమెకు ఫిర్యాదు చేయగా.. వెంటనే ఈ సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు. మురుగు కాలువ నిర్మాణానికి పంచాయతీ, జడ్పీ నిధులను వినియోగించాలని సర్పంచ్ స్పూర్తి, జడ్పీటీసీ సంతోషకు సూచించారు. కార్యక్రమంలో ఎంపీపీ ప్రభాకర్, మార్కెట్ కమిటీ చైర్మన్ మల్లేశం, డీఎల్పీవో అనితా, ఎంపీడీవో బాలయ్య, డీఈలు రాజేందర్, శ్రీనివాస్, మండల ప్రత్యేకాధికారి సుజాత, ఏపీవో సుధాకర్, మార్కెట్ కమిటీ చైర్మన్ మల్లేశం తదితరులు పాల్గొన్నారు.
రోడ్డు పనులను పూర్తి చేయాలి..
ప్రభుత్వం నిధులిచ్చినా రోడ్డు పనులు చేయడంలో ఆలస్యం ఎందుకని ఆర్అండ్బీ డీఈ శ్రీనివాస్పై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.మండల కేంద్రంలో తొరుమామిడి-బంట్వారం, నాగసముందర్-బంట్వారం, బంట్వారం-సదాశివపేట ఆర్అండ్బీ రోడ్లను కలెక్టర్ పరిశీలించారు. తొరుమామిడి-బంట్వారం రోడ్డు మరమ్మతులకు ప్రభుత్వం కొన్ని నెలల క్రితమే రూ 3 లక్షల ఇచ్చినా పనులు ప్రారంభించకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. వారం రోజుల్లో పనులు ప్రారంభించాలని ఆదేశించారు. అదేవిధంగా చివరి దశలో నిలిచిపోయిన నాగసముందర్-బంట్వారం రోడ్డు పనులు వెంటనే పూర్తి చేయాలన్నారు.