మలేషియా మాస్టర్స్ నుంచి భారత స్టార్ షట్లర్ పీవీ సింధు నిష్క్రమించింది. తన చిరకాల ప్రత్యర్థి, ప్రపంచ నెంబర్ 2 తై జు యింగ్ చేతిలో మరోసారి ఓడిన సింధు ఇంటి బాట పట్టింది. మలేషియా మాస్టర్స్ సూపర్ 500లో భాగంగా చైనీస్ తైపీ క్రీడాకారిణి తై జుతో పోరాడిన సింధు.. 13-21, 21-12, 12-21 తేడాతో ఓడింది. తై జు చేతిలో సింధు ఓడిపోవడం ఇది 17వ సారి కావడం గమనార్హం.
2019 వరల్డ్ ఛాంపియన్షిప్లో చివరగా తై జును సింధు మట్టికరిపించింది. ఆ తర్వాత మళ్లీ తై జుపై పైచేయి సాధించలేకపోయింది. మలేషియా ఓపెన్లో కూడా ఆమె చేతిలోనే ఓడిన సింధు.. ఇప్పుడు మలేషియా మాస్టర్స్లో కూడా తై జు చేతిలో ఓటమిపాలైంది. 55 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్లో తొలి సెట్ కోల్పోయిన సింధు.. రెండో సెట్లో ధాటిగా ఆడి విజయం సాధించింది. నిర్ణయాత్మక మూడో సెట్లో తై జు మరోసారి తనదైన ఆటతీరుతో సింధుపై పైచేయి సాధించి మ్యాచ్ తన సొంతం చేసుకుంది.