కౌలాలంపూర్: భారత స్టార్ షట్లర్ పీవీ సింధు టైటిల్ వేటలో దూసుకెళుతున్నది. గత కొంత కాలంగా ఫామ్లేమికి తోడు ఫిట్నెస్తో సతమతమవుతున్న సింధు మలేషియా మాస్టర్స్ టోర్నీలో ఫైనల్లోకి దూసుకెళ్లింది. ఈ ఏడాది తుదిపోరులో నిలిచిన తొలి టోర్నీ ఇదే కావడం విశేషం. శనివారం జరిగిన మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో ఐదో సీడ్ సింధు 13-21, 21-16, 21-12తో ప్రపంచ 20వ ర్యాంకర్ బుసానన్ ఒన్ముగ్రున్ఫెన్(థాయ్లాండ్)పై అద్భుత విజయం సాధించింది. 88 నిమిషాల పాటు సాగిన పోరులో తొలి గేమ్ కోల్పోయిన ఈ తెలుగు షట్లర్ పుంజుకుని పోటీలోకి వచ్చింది.
ప్రత్యర్థికి ఎక్కడా అవకాశమివ్వకుండా ఓవైపు కండ్లు చెదిరే స్మాష్లకు తోడు నెట్గేమ్తో సింధు కీలక పాయింట్లు ఖాతాలో వేసుకుంది. ఈ క్రమంలో రెండోగేమ్ను దక్కించుకున్న సింధు కీలకమైన మూడో గేమ్లోనూ అదే దూకుడు కొనసాగించి మ్యాచ్ను కైవసం చేసుకుంది. చివరిసారి 2022లో సింగపూర్ ఓపెన్ గెలిచిన ఈ యువ షట్లర్ 2023లో మాడ్రిడ్ ఓపెన్లో రన్నరప్గా నిలిచింది.
ఆదివారం జరిగే ఫైనల్లో వాంగ్ జి(చైనా)తో తలపడుతుంది. మ్యాచ్ ముగిసిన తర్వాత సింధు మాట్లాడుతూ ‘టోర్నీలో మరో మ్యాచ్ గెలిస్తే నేను ఇంకా సంతోషంగా ఉంటాను. ఈ రోజు జరిగిన పోరులో గెలువడం కూడా ఆనందంగా ఉంది. ఇలాంటి విజయాలు మరింత ఆత్మవిశ్వాసాన్ని ఇస్తాయి. తొలి గేమ్ కోల్పోయినా.. రెండో గేమ్లో ఆధిక్యంలోకి వచ్చాను.