రెండుసార్లు ఒలింపిక్ విజేత, తెలుగు తేజం పీవీ సింధు కామన్వెల్త్ క్రీడలలో స్థాయికి తగ్గ ప్రదర్శన చేస్తున్నది. ఆదివారం జరిగిన మహిళల బ్యాడ్మింటన్ సింగిల్స్ సెమీఫైనల్లో సింధు.. 21-19, 21-17 తేడాతో జియ మిన్ యో (సింగపూర్) ను ఓడించి ఫైనల్స్కు దూసుకెళ్లింది.
రెండు వరుస గేమ్లలో జియాను ఓడించిన సింధు.. ఫైనల్స్లో స్వర్ణం మీదే దృష్టి సారించింది. కామన్వెల్త్ గేమ్స్లో సింగిల్స్ విభాగంలో ఆమెకు ఇది రెండో పతకం కానుంది. 2018 గోల్డ్ కోస్ట్లో ముగిసిన కామన్వెల్త్ క్రీడలలో సింధు.. రజతం సాధించిన విషయం తెలిసిందే. కానీ ఈసారి మాత్రం ఆమె స్వర్ణం సాధించాలనే పట్టుదలతో ఉంది.
ఇక ఆదివారం భారత జట్టుకు పతకాల పంట పండుతున్నది. బాక్సింగ్లో నీతు గంగాస్ మహిళల 48 కిలోల బాక్సింగ్ పోటీలలో స్వర్ణం నెగ్గింది. ఫైనల్స్లో ఆమె.. 5-0 తేడాతో ఇంగ్లాండ్ బాక్సర్ డెమీ జేడ్ను ఓడించి బంగారు పతకం సాధించింది. బాక్సింగ్లో భారత్కు ఇదే తొలి పతకం. పురుషుల బాక్సింగ్లో భాగంగా 51 కిలోల ఈవెంట్లో అమిత్ పంగల్.. 5-0తో ఇంగ్లండ్ బాక్సర్ కియరన్ మెక్ డొనాల్డ్పై నెగ్గి బాక్సింగ్లో రెండో స్వర్ణాన్ని అందించాడు. ఇక మహిళల హాకీలో భారత జట్టు.. 2-1 (1-1) తేడాతో డిఫెండింగ్ ఛాంపియన్ న్యూజిలాండ్ను ఓడించి కాంస్యం గెలుచుకుంది.
కామన్వెల్త్ క్రీడలలో ఇప్పటివరకు మొత్తంగా భారత్ 43 పతకాలతో ఐదో స్థానంలో నిలిచింది. ఇందులో 15 స్వర్ణాలు, 11 రజతాలు, 17 కాంస్యాలున్నాయి.