Chateshwar Pujara : భారత జట్టు నయావాల్ ఛతేశ్వర్ పూజారా(Chateshwar Pujara) ఫస్ట్ క్లాస్ క్రికెట్లో మరో రికార్డు నెలకొల్పాడు. దేశవాళీ క్రికెట్(Domestic Cricket)లో 20 వేల పరుగులు పూర్తి చేసుకున్నాడు. తద్వారా ఈ ఫీట్ సాధించిన భారత నాలుగో క్రికెటర్గా గుర్తింపు సాధించాడు. రంజీ ట్రోఫీలో భాగంగా నాగ్పూర్లో విదర్భ(Vidarbha)తో జరిగిన మ్యాచ్లో పుజారా 20 వేల పరుగుల మైలురాయికి చేరువయ్యాడు.
నయావాల్ కంటే ముందు దిగ్గజ ఆటగాళ్లు సునీల్ గవాస్కర్(Sunil Gavaskar), సచిన్ టెండూల్కర్(Sachin Tendulkar), రాహుల్ ద్రవిడ్(Rahul Dravid) ఈ ఫీట్ సాధించారు. లిటిల్ మాస్టర్ 348 మ్యాచుల్లో 51.46 సగటుతో 25,834 రన్స్ కొట్టాడు. సచిన్ 310 మ్యాచుల్లో 57.84 సగటుతో 25,396 పరుగులతో రెండో స్థానంలో ఉన్నాడు.
గవాస్కర్, సచిన్, ద్రవిడ్
టీమిండియా వాల్గా పేరొందిన ద్రవిడ్ 298 మ్యాచుల్లో 23,794 రన్స్తో మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. పూజారా 260 మ్యాచుల్లో 51.96 సగటుతో 20,013 రన్స్ కొట్టాడు. విదర్భతో జరిగిన మ్యాచ్లో పూజారా కీలక ఇన్నింగ్స్ ఆడాడు. తొలి ఇన్నింగ్స్లో 43, రెండో ఇన్నింగ్స్లో 66 రన్స్ చేసి సౌరాష్ట్రను ఆదుకున్నాడు.
నిరుడు ప్రపంచ టెస్టు చాంపియన్షిప్(WTC 2023)లో పూజారా దారుణంగా విఫలమయ్యాడు. అప్పటివరకూ ఇంగ్లండ్ గడ్డపై కౌంటీల్లో దంచి కొట్టిన ఈ స్టార్ బ్యాటర్.. రెండు ఇన్నింగ్స్ల్లో నిరాశపరిచాడు. దాంతో, సెలెక్టర్లు వెస్టిండీస్తో సిరీస్కు అతడిని పక్కన పెట్టేశారు. దాంతో రంజీలపై దృష్టిపెట్టిన పూజారా అప్పటినుంచి నిలకడగా రాణిస్తున్నాడు.
అయినా సరే ఇంగ్లండ్తో తొలి రెండు టెస్టులకు సెలెక్టర్లు అతడిని ఎంపిక చేయలేదు. అయితే.. మిడిలార్డర్లో వెన్నెముక లాంటి పూజారా మళ్లీ కమ్బ్యాక్ కోసం ఎదురు చూస్తున్నాడు. మరోవైపు సీనియర్ ఆటగాడు అజింక్యా రహానే వరుసగా రెండు గోల్డెన్ డక్స్తో రేసులో వెనకబడ్డాడు. మరి ఆఖరి మూడు టెస్టుల్లో అయినా సెలెక్టర్లు పూజారాకు చాన్స్ ఇస్తారా? లేదా? అనేది చూడాలి.