Pruthvi Shaw : దేశవాళీ క్రికెట్లో శతకాల మోత మోగిస్తున్న ముంబై ఓపెనర్ పృథ్వీ షా మళ్లీ భారత జట్టుకు ఎంపికయ్యాడు. కివీస్తో మూడు టీ20ల సిరీస్కు అతను సెలక్ట్ అయ్యాడు. 537 రోజుల తర్వాత అతనికి టీ20 జట్టు నుంచి పిలుపొచ్చింది. చాలా రోజుల తర్వాత టీమిండియా జెర్సీ వేసుకొనే అవకాశం రావడంతో ఈ యువ ఆటగాడు పట్టలేని సంతోషంతో ఉన్నాడు. ఇన్స్టాగ్రామ్లో వరుస పోస్టులు పెట్టాడు. టీ20 జట్టులో పునరాగమనం చేస్తున్న అతడికి శుభాకాంక్షలు తెలుపుతూ అభిమానులు కూడా సోషల్మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
రంజీ ప్రస్తుత సీజన్లో పృథ్వీ షా రెచ్చిపోయి ఆడుతున్నాడు. అస్సాంపై రికార్డు ట్రిపుల్ సెంచరీ (379) బాదాడు. దాంతో అతడిని అభినందిస్తూ బీసీసీఐ సెక్రటరీ జై షా ట్విట్టర్లో పోస్ట్ పెట్టాడు. ఈ యంగ్స్టర్ 2018లో భారత జట్టుకు ఎంపికయ్యాడు. 2021లో శ్రీలంక సిరీస్లో చివరి మ్యాచ్ ఆడాడు. ఐపీఎల్లో ఈ యంగ్ క్రికెటర్ విధ్వంసక ఓపెనర్గా పేరు తెచ్చుకున్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంఛైజీకి శుభారంభం ఇస్తూ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు.