వాషింగ్టన్, మే 14: వైట్హౌస్ పరిసరాల్లోకి ట్రక్కుతో దూసుకొచ్చి దాడి చేసిన కేసులో తెలుగు కుర్రాడు సాయివర్షిత్ కందుల (20) నేరాన్ని అంగీకరించాడు. తన లక్ష్యం కోసం వీలైతే అధ్యక్షుడు బైడెన్ను చంపాలనుకున్నానని కోర్టు విచారణలో తెలిపాడు. గత ఏడాది మే 22న సాయి వర్షిత్ అద్దె ట్రక్కుతో వైట్హౌస్ వద్ద బీభత్సం సృష్టించాడు.
వైట్హౌస్ భవనంలోకి వెళ్లి అధికారాన్ని కైవసం చేసుకోవడమే లక్ష్యంగా ఈ దాడి చేశానని నిందితుడు విచారణలో తెలిపాడు. తన లక్ష్యాన్ని చేరుకునే క్రమంలో వీలైతే అధ్యక్షుడు బైడెన్ సహా ఇతరులను కూడా చంపాలని ముందుగానే ప్లాన్ చేసుకున్నట్టు చెప్పాడు. ఈ కేసులో నిందితుడు ఉద్దేశపూర్వకంగా ప్రజా ప్రభుత్వానికి హాని చేసేందుకు ఈ ఘటనకు పాల్పడినట్టు విచారణలో రుజువైందని యుఎస్ అటార్నీ తెలిపింది.