BCCI Twitter | న్యూఢిల్లీ, ఆగస్టు 13: అవును! నిజమే. ప్రధానమంత్రి నరేంద్రమోదీ మాటను ఆచరణలో పెట్టిన బీసీసీఐకి భారీ షాక్ తగలింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని సోషల్
మీడియాలో ప్రతి ఒక్కరు తమ డీపీని త్రివర్ణ పతాకంతో మార్చుకోవాలని మోదీ పిలుపునిచ్చారు. వెంటనే స్పందించిన బీసీసీఐ ఆలస్యం చేయకుండా ఎక్స్ (ట్విట్టర్)లో తన డీపీని మువ్వన్నెల పతాకంతో మార్చేసింది. ఊహించని విధంగా ఆ వెంటనే బీసీసీఐకి షాక్ తగిలింది. తన వెరిఫికేషన్ బ్లూటిక్ను కోల్పోయింది.
బ్లూటిక్ లేని బీసీసీఐ ఖాతాను చూసి నెటిజన్లు విస్తుపోయారు. అంతకుముందు వరకు ఉన్న బ్లూటిక్ ఎందుకు పోయిందా? అని ఆరా తీస్తే తర్వాత అసలు విషయం తెలిసి వారు కూడా షాకయ్యారు. ఎక్స్ సవరించిన మార్గదర్శకాల ప్రకారం.. ఏదైనా ఖాతా ప్రొఫైల్ డీపీ మారిన వెంటనే ఆ ఖాతా బ్లూటిక్ ఎగిరిపోతుంది. ఆ తర్వాత ఆ ఖాతాను ఎక్స్ మేనేజ్మెంట్ రివ్యూ చేసి అన్ని మార్గదర్శకాలను అది పాటించినట్టు భావిస్తే అప్పుడు బ్లూ టిక్ను పునరుద్ధరిస్తుంది. లేదంటే అంతే సంగతులు.
Read also: England | 2019 వరల్డ్ కప్ హీరోల కోసం ఇంగ్లండ్ ఎదురుచూపు.. ఆ ఇద్దరూ ఈసారి ఆడతారా?
దీనిని బట్టి చూస్తే బీసీసీఐ తన బ్లూటిక్ను మరోమారు కోల్పోయే అవకాశం కనిపిస్తోంది. స్వాతంత్ర్య దినోత్సవం అనంతరం బీసీసీఐ తన ప్రొఫైల్ డీపీని మళ్లీ మార్చి పాతదాన్నే పునరుద్ధరించినా అప్పుడు కూడా బ్లూటిక్ మాయమైపోతుంది. ఎక్స్ మళ్లీ ఆ ఖాతాను రివ్యూ చేసి పునరుద్ధరించే వరకు బ్లూటిక్ లేకుండానే బీసీసీఐ ఖాతా దర్శనమిస్తుంది.