IPL 2024 : భారత స్టార్ వికెట్ కీపర్ రిషభ్ పంత్(Rishabh Pant) పునరాగమనానికి సిద్ధమవుతున్నాడు. కారు యాక్సిడెంట్ కారణంగా ఏడాదికి పైగా ఆటకు దూరమైన ఈ డాషింగ్ బ్యాటర్ ఐపీఎల్ 17వ సీజన్(IPL 2024)తో రీ ఎంట్రీ ఇవ్వనున్నాడు. అయితే.. పంత్ అన్ని మ్యాచ్లు ఆడుతాడా? లేదా? అనే అనుమానం అందరిలో నెలకొంది. ఐపీఎల్ 2024 ఎడిషన్కు మరో నెల రోజులే ఉండడంతో.. ఢిల్లీ క్యాపిటల్స్ హెడ్కోచ్ రికీ పాంటింగ్(Ricky Ponting) అభిమానులకు గుడ్న్యూస్ చెప్పాడు. పంత్ 17వ సీజన్లో అన్ని మ్యాచ్లు ఆడుతాడని స్పష్టం చేశాడు.
‘పంత్ ఒక డైనమిక్ ప్లేయర్. ఈసారి ఢిల్లీ కెప్టెన్ అతడే. గత సీజన్లో మేము అతడిని ఎంతో మిస్ అయ్యాం. పంత్ కూడా 17వ సీజన్లో ఆడేందుకు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నాడు. అయితే.. అతడు మునపటిలా ఆడుతాడా? లేదా? అనేది ఇప్పుడే చెప్పలేం. సోషల్ మీడియాలో అతడి వర్కవుట్ వీడియోలు చూస్తే.. వేగంగా పరుగెడుతున్నాడు. ఫిట్గా కనిపిస్తున్నాడు. నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేసుందుకు సిద్ధంగా ఉన్నానని మాతో చెప్పాడు. మరోవైపు మోగా టోర్నీలో మా తొలి మ్యాచ్కు ఆరు వారాలే టైమ్ ఉంది. అందుకని ఈసారి వికెట్ కీపింగ్ అతడే చేస్తాడా? అనేది కూడా త్వరలోనే వెల్లడిస్తాం’ అని పాంటింగ్ తెలిపాడు.
Will we see Rishabh Pant playing the whole #IPL2024 season? 🤔
Delhi Capitals coach Ricky Ponting shared his thoughts 👉 https://t.co/jWWgUmVrDS pic.twitter.com/S12hi2NLI4
— ESPNcricinfo (@ESPNcricinfo) February 7, 2024
రెండేండ్ల క్రితం రూర్కీ సమీపంలో కారు యాక్సిడెంట్కు గురైన పంత్ ఆటకు దూరమై దాదాపు 14 నెలలు అవుతోంది. నేషనల్ క్రికెట్ అకాడమీలో కోలుకున్న పంత్ కష్టమైన వ్యాయామాలు చేస్తూ ఫిట్నెస్ సాధించాడు. ఐపీఎల్ 17వ సీజన్కు మరో నెల రోజులే ఉండడంతో పంత్ జిమ్లో చెమటోడ్చుతున్నాడు.
పంత్ గైర్హాజరీలో డేవిడ్ వార్నర్ 16వ సీజన్లో ఢిల్లీకి సారథిగా వ్యవహరించాడు. కెప్టెన్గా అతడు రాణించినప్పటికీ.. ఓపెనర్ పృథ్వీ షా, ఆల్రౌండర్లు మిచెల్ మార్ష్, రిలే రస్సో, మనీశ్ పాండేలు తీవ్రంగా నిరాశపరిచారు. దాంతో, ఢిల్లీ 14 మ్యాచుల్లో కేవలం ఐదింటిలోనే గెలుపొందింది. 14వ సీజన్లో రన్నరప్గా నిలిచిన ఢిల్లీ మరీ దారుణమన ఆటతో పాయింట్ల పట్టికలో 9వ స్థానంతో సరిపెట్టుకుంది.