IPL 2024 | ప్రపంచ క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని వేచిచూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ – 17వ సీజన్ వచ్చే నెలలో మొదలవుతుందని బీసీసీఐ ఇదివరకే స్పష్టతనిచ్చినా తేదీ విషయంలో మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. ఈ ఏడాది దేశంలో సాధారణ ఎన్నికల నేపథ్యంలో ఐపీఎల్ను రెండు దఫాలుగా జరిపిస్తారని ఊహాగానాలు వినిపిస్తున్నా ప్రారంభ తేదీ మాత్రం ఇంకా వెలువడలేదు. అయితే తాజాగా ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ఛైర్మన్ అరుణ్ ధుమాల్ ఈ టోర్నీ ప్రారంభమయ్యే తేదీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మార్చి 22 నుంచి 17వ సీజన్ను చెన్నై వేదికగా మొదలుపెట్టనున్నట్టు ధుమాల్ తెలిపాడు.
ఐఎఎన్ఎస్తో అరుణ్ ధుమాల్ మాట్లాడుతూ.. ‘మార్చి 22 నుంచి ఐపీఎల్ -17ను ఆరంభించాలని మేం ప్రణాళికలు సిద్ధం చేశాం. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వంతో పాటు ప్రభుత్వ ఏజెన్సీలతోనే సమన్వయం చేసుకుంటున్నాం. టోర్నీలో కొంత షెడ్యూల్ను ముందు విడుదల చేస్తాం. ఈ సీజన్లో మ్యాచ్లు మొత్తం భారత్లోనే జరుగుతాయి..’ అని తెలిపాడు.
ధుమాల్ వ్యాఖ్యలను బట్టి చూస్తే ఈ సీజన్లో తొలి అంచె షెడ్యూల్ను ముందుగా ప్రకటించి ఆ తర్వాత జనరల్ ఎలక్షన్స్ షెడ్యూల్ ప్రకారం రెండో దఫా షెడ్యూల్ను ప్రకటించే అవకాశముంది. కేంద్ర ఎన్నికల సంఘం త్వరలోనే లోక్సభ ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించే అవకాశముంది. అది ప్రకటించిన తర్వాతే ఐపీఎల్ ఫుల్ షెడ్యూల్పై పూర్తి స్పష్టత వస్తుంది.
We can start intitial process (IPL) from March 22 and then will see how the dates of general polls announced, will plan later fixtures accordingly then; Arun Dhumal to IANS https://t.co/K45KqJ4MzG
— IANS (@ians_india) February 20, 2024