Prithvi Shaw | టీమ్ఇండియాలో అవకాశం దక్కించుకోలేక.. ఇంగ్లండ్ వన్డే కప్లో పాల్గొంటున్న యువ ఓపెనర్ పృథ్వీ షా మరోసారి వార్తల్లోకెక్కాడు. లండన్ వేదికగా ఇటీవల తన బ్యాటింగ్ విన్యాసాలతో ఆకట్టుకున్న పృథ్వీ.. తాజాగా సోషల్ మీడియాలో ఆసక్తికర స్టోరీ పంచుకున్నాడు. ఇటీవల వన్డే కప్లో భాగంగా ఓ డబుల్ సెంచరీ, ఓ సెంచరీతో ఆకట్టుకున్న పృథ్వీ షా.. మోకాలి గాయం కారణంగా టోర్నీకి దూరమయ్యాడు. మెరుగైన ప్రదర్శనతో భారత జట్టులో చోటు దక్కించుకోవాలనుకుంటున్న యువ ఓపెనర్ ప్రస్తుతం గాయంతో ఇబ్బంది పడుతున్నాడు. దీంతో వన్డే కప్నకు దూరమైన పృథ్వీ విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఈ క్రమంలో సామాజిక మాధ్యమాల వేదికగా పృథ్వీ స్పందిస్తూ.. మంచి స్థాయికి చేరిన తర్వాత అందరూ ప్రశంసలు కురిపిస్తారని.. అదే కిందకు జారిపోతున్నప్పుడు మాత్రం ఎవరూ పట్టించుకోరనే అర్థం వచ్చేలా ఇన్స్టాగ్రామ్లో స్టోరీ పోస్ట్ చేశాడు.
‘జీవితంలో పైకి వచ్చినప్పుడు ప్రజలు చేయి అందిస్తారు. కానీ కిందకు పడిపోతున్నప్పుడు వదిలేస్తారు’ అని గాయంతో మెట్ల మీద నుంచి కిందికి దిగుతున్న ఫొటోలు పోస్ట్ చేశాడు. ఫామ్ లేమి, ఫిట్నెస్ సమస్యలు, గాయాలతో ఇబ్బంది పడుతున్న ఈ ఓపెనర్ భారత జట్టులో చోటు దక్కించుకునేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం సాధించలేకపోతున్నాడు. ఐపీఎల్లోనూ పెద్దగా ఆకట్టుకోలేకపోయిన పృథ్వీ.. ఇప్పట్లో టీమ్ఇండియాలోకి రావడం కష్టమే అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు పృథ్వీతో కలిసి ఆడిన శుభ్మన్ గిల్ మూడు ఫార్మాట్లలో భారత కీలక ప్లేయర్గా ఎదగగా.. పృథ్వీ మాత్రం జట్టులో చోటు కోసం శ్రమిస్తున్నాడు.