ఐపీఎల్ మీడియా హక్కుల ద్వారా భారీగా ఆర్జించిన భారత క్రికెట్ బోర్డు.. రాబోయే రోజుల్లో ఈ లీగ్ మరింత విస్తరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నది. మ్యాచుల సంఖ్యను పెంచేందుకు ప్రతిపాదనలు చేస్తున్నది. 74 మ్యాచులను క్రమంగా 84, 94 కు పెంచాలని.. ఐపీఎల్ ను రెండున్నర నెలలు ఆడించాలని ప్రయత్నాలు చేస్తున్నట్టు సాక్షాత్తు బీసీసీఐ సెక్రటరీ జై షా వెల్లడించిన విషయం తెలిసిందే. అయితే ఈ ప్రతిపాదనపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) అసంతృప్తి వ్యక్తం చేసింది.
ఐసీసీ వచ్చే ఫ్యూచర్ టూర్ ప్రోగ్రామ్స్ (FTP)షెడ్యూల్ లో ఐపీఎల్ ను కూడా చేర్చాలని ఆ మేరకు ద్వైపాక్షిక సిరీస్ లను నిర్వహించేలా ఐసీసీ తో చర్చలు జరుపుతామని జై షా వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. అయితే పీసీబీ మాత్రం ఈ ప్రతిపాదనపై ఇతర దేశాల క్రికెట్ బోర్డులతో చర్చించాలని నిర్ణయించింది. ఐసీసీ.. ఐపీఎల్ కు అనుకూలంగా వ్యవహరిస్తే అది ద్వైపాక్షిక సిరీస్ ల మీద తీవ్ర ప్రభావం చూపుతుందని అసహనం వ్యక్తం చేసింది.
ఎన్డీటీవీలో వచ్చిన సమాచారం మేరకు..‘వచ్చే జులైలో జరుగబోయే కామన్వెల్త్ క్రీడల సందర్భంగా బర్మింగ్హోమ్ లో ఐసీసీ సమావేశం కానున్నది. ఆ మీటింగ్ లో ఈ విషయం (ఐపీఎల్ రెండున్నర నెలలు) గురించి చర్చిస్తాం. జై షా తాము ద్వైపాక్షిక సిరీస్ లు నిర్వహిస్తాం అని చెప్పారు. కానీ ప్రతి దేశం ప్రాంచైజీ క్రికెట్ ఆడుతున్నందున ఇది ఇతర బోర్డులతో చర్చించాల్సిన అవసరం ఉంది..’ అని పీసీబీ కి చెందిన ఓ అధికారి తెలిపారు.