IPL | ముంబై : ఐపీఎల్-18లో సమిష్టి ప్రదర్శనతో ఇప్పటికే ప్లేఆఫ్స్ బెర్తును ఖాయం చేసుకున్న పంజాబ్ కింగ్స్ మరో స్ఫూర్తివంతమైన ఆటతీరుతో సత్తా చాటింది. లీగ్ దశలో తాము ఆడిన ఆఖరి మ్యాచ్లో ముంబై ఇండియన్స్ను ఓడించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానాని (19 పాయింట్లతో)కి దూసుకెళ్లింది. సోమవారం జైపూర్లో ముంబైతో జరిగిన మ్యాచ్లో శ్రేయాస్ సేన.. ముంబైని ఏడు వికెట్ల తేడాతో గెలిచి లీగ్ దశను విజయంతో ముగించింది. ముంబై నిర్దేశించిన 185 పరుగుల ఛేదనను ఆ జట్టు.. 18.3 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి దంచేసింది. జోష్ ఇంగ్లిస్ (42 బంతుల్లో 73, 9 ఫోర్లు, 3 సిక్సర్లు), ప్రియాన్ష్ ఆర్య (35 బంతుల్లో 62, 9 ఫోర్లు, 2 సిక్సర్లు) వీరబాదుడు బాది ముంబై టాప్-2 ఆశలపై నీళ్లు చల్లారు. మొదట బ్యాటింగ్ చేసిన ముంబై.. సూర్యకుమార్ యాదవ్ (39 బంతుల్లో 57, 6 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించడంతో 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది.
ఛేదనలో కింగ్స్ ఓపెనర్ ప్రభ్సిమ్రన్ (13) క్రీజులో నిలిచేందుకు ఇబ్బందిపడుతూ ఇన్నింగ్స్ ఐదో ఓవర్లోనే నిష్క్రమించినా మరో ఓపెనర్ ప్రియాన్ష్ అండగా మూడో స్థానంలో వచ్చిన ఇంగ్లిస్ చెలరేగిపోయాడు. ప్రియాన్ష్ ఆరంభం నుంచే దూకుడుగా ఆడగా క్రీజులో కుదురుకున్నాక ఇంగ్లిస్ జోరు పెంచాడు. అశ్వని ఓవర్లో హ్యాట్రిక్ బౌండరీలు బాదిన ఇంగ్లిస్.. హార్దిక్ ఓవర్లో సింగిల్ తీసి ఫిఫ్టీ పూర్తిచేశాడు. ఇదే ఓవర్లో ప్రియాన్ష్.. 4, 6తో హాఫ్ సెంచరీ సాధించాడు. రెండో వికెట్కు ఈ ఇద్దరూ 59 బంతుల్లో 109 రన్స్ జోడించి కింగ్స్ను గెలుపు దిశగా తీసుకెళ్తుండగా ఎట్టకేలకు శాంట్నర్ 15వ ఓవర్లో ప్రియాన్ష్ను ఔట్ చేశాడు. విజయం ముంగిట ఇంగ్లిస్ కూడా నిష్క్రమించినా శ్రేయాస్ (26*), వధెర (2*) లాంఛనాన్ని పూర్తిచేశారు.
ఈ సీజన్లో టాప్ ఫామ్లో ఉన్న సూర్య మరోసారి ముంబై ఇన్నింగ్స్కు వెన్నెముకగా మారాడు. ఓపెనర్లు రోహిత్ (24), రికెల్టన్ (27) ఫర్వాలేదనిపించినా ఆశించిన స్థాయిలో మెరుపులు మెరిపించలేదు. రికెల్టన్ ఆరో ఓవర్లో యాన్సెన్ బౌలింగ్లో శ్రేయాస్కు క్యాచ్ ఇవ్వడంతో సూర్య క్రీజులోకి వచ్చాడు. అతడు జెమీసన్ 9వ ఓవర్లో 6, 4, 4తో స్కోరువేగం పెంచాడు. కానీ బ్రర్ మరుసటి ఓవర్లో రోహిత్ను ఔట్ చేశాడు. తిలక్ (1), విల్ జాక్స్ (17) నిరాశపరచగా మిడిల్ ఓవర్స్లో పంజాబ్ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేయడంతో ముంబై ధాటిగా ఆడలేకపోయింది. కానీ హార్దిక్ (26) రెండు బౌండరీలు, రెండు సిక్సర్లతో ముంబై ఇన్నింగ్స్కు ఊపు తెచ్చాడు. అయితే అతడు యాన్సెన్ ఓవర్లో నిష్క్రమించినా ఆఖర్లో నమన్ (20)తో కలిసి సూర్య మెరుపులు మెరిపించి ముంబైకి పోరాడే స్కోరును అందించాడు.