Paralympics: భారతదేశ క్రీడల చరిత్రలో టోక్యో పారాలింపిక్స్ ( Paralympics ) ఎప్పటికీ ప్రత్యేకమైనవిగా నిలిచిపోతాయని ప్రధాని నరేంద్రమోదీ సంతోషం వ్యక్తంచేశారు. ప్రతి భారతీయుడి జ్ఞాపకాల్లో ఈ పారాలింపిక్స్ చెరగని ముద్రగా మిగిలిపోతాయని ట్విట్టర్లో పేర్కొన్నారు. భావి తరాల్లో చాలా మంది క్రీడలవైపు ఆకర్షితులయ్యేందుకు ఈ పారాలింపిక్స్ దోహదం చేస్తాయని చెప్పారు. పారాలింపిక్స్కు వెళ్లిన భారత బృందంలోని ప్రతి సభ్యుడు ఒక చాంపియన్ అని, భావి తరాల్లో ప్రేరణ కల్పించే ఒక వనరు అని ఆయన కొనియాడారు.
చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ఒకే పారాలింపిక్స్లో మన పారాలింపియన్లు 19 పతకాలు గెలిచి మనందరి హృదయాలను పరవశింపజేశారని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. ఈ విజయానికి దోహదపడిన కోచ్లు, సపోర్ట్ స్టాఫ్తోపాటు క్రీడాకారుల కుటుంబాలను ప్రధాని మెచ్చుకున్నారు. ఈ విజయం భవిష్యత్తులో క్రీడల్లో భాగస్వామ్యం పెరుగడానికి దోహదం చేస్తుందని ఆశిద్దామని పేర్కొన్నారు. అదేవిధంగా విజయవంతంగా ఒలింపిక్స్, పారాలింపిక్స్ నిర్వహించిన జపాన్ ప్రభుత్వాన్ని ప్రధాని ప్రశంసించారు.