ఇంగ్లండ్ తో జులై 1 నుంచి ఎడ్జబాస్టన్ వేదికగా మొదలుకాబోయే ఐదో టెస్టుకు ముందే కరోనా బారిన పడ్డ టీమిండియా సారథి రోహిత్ శర్మ ఈ టెస్టులో ఆడతాడా..? లేదా..? అని అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా హిట్ మ్యాన్ కూతురు సమైరా అతడి ఆరోగ్యం గురించి కీలక అప్డేట్ ఇచ్చింది. ఆ చిన్నారి తనకు తెలిసిన సమాచారాన్ని చాలా క్యూట్ గా చెప్పింది.
రోహిత్ ను కలిసి ఆయన భార్య రితికాతో కలిసి సమైరా బయటకు వస్తుండగా అక్కడే ఉన్న ఓ వ్యక్తి సమైరాతో మీ నాన్న ఎలా ఉన్నాడు..? అని ప్రశ్నించాడు. దీనికి సమైరా మాట్లాడుతూ..‘డాడీ తన రూమ్ లో ఉన్నాడు. పాజిటివ్. నెలరోజుల వరకు కోలుకుంటాడు. డాడీ ఇప్పుడు నిద్ర పోతున్నాడు..’ అంటూ తన ముద్దుముద్దు మాటలతో క్యూట్ గా సమాధానమిచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.
కాగా లీస్టర్షైర్ తో ప్రాక్టీస్ మ్యాచ్ ఆడుతూ కరోనా బారిన పడ్డ రోహిత్.. ప్రస్తుతం ఐసోలేషన్ లో ఉన్నాడు. నిబంధనల ప్రకారం కరోనా బారిన పడ్డ క్రికెటర్ తప్పకుండా వారం రోజుల పాటు క్వారంటైన్ పూర్తి చేసుకోవాలి. జులై 1 వరకు అతడు కోలుకుంటాడా..? లేదా..? అన్నది అనుమానంగానే ఉండటంతో టీమ్ మేనేజ్మెంట్ మయాంక్ అగర్వాల్ ను ఆగమేఘాల మీద యూకేకు పంపింది.
ఇంగ్లండ్ తో గతేడాది నాలుగు టెస్టులు ఆడి 2-1 ఆధిక్యంలో ఉన్న భారత జట్టు.. చివరి టెస్టును డ్రా చేసుకున్నా సిరీస్ మనదైనట్టే. ఈ టెస్టులో ఆతిథ్య జట్టు గెలిస్తే మాత్రం సిరీస్ సమం అవుతుంది. ఈ టెస్టు తర్వాత భారత జట్టు ఇంగ్లండ్ తో జులై 7 నుంచి మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడనుంది.
#RohitSharma Daughter #samaira Today at #Leicester How cute she is 😍😍 MY FATHER IS TAKING REST IN THE ROOM GOT #covidpositive @ritssajdeh @ImRo45 #ENGvIND @ITGDsports pic.twitter.com/Tbpu0HSUIQ
— Krishna sai ✊🇮🇳 (@Krishna19348905) June 27, 2022