హైదరాబాద్, ఆట ప్రతినిధి: వన్డే ప్రపంచకప్లో భాగంగా శుక్రవారం ఉప్పల్లోని రాజీవ్గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో నెదర్లాండ్స్తో పాకిస్థాన్ తలపడనుంది. ఇక్కడ జరిగిన గత రెండు వార్మప్ మ్యాచ్ల్లోనూ భారీగా పరుగులు చేసిన పాక్ జట్టు.. ఆ అనుభవాన్ని మెగాటోర్నీలో వినియోగించుకోవాలని చూస్తుంటే.. తొలి మ్యాచ్లోనే పెద్ద జట్టుకు షాక్ ఇవ్వాలని నెదర్లాండ్స్ భావిస్తున్నది. ఆసియాకప్లో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన పాకిస్థాన్.. ప్రాక్టీస్ మ్యాచ్ల్లోనూ పరాజయం పాలైన విషయం తెలిసిందే. అయితే అనిశ్చితికి మారుపేరైనా పాకిస్థాన్ జట్టును అంచనా వేయడానికి లేదు. ఇమామ్ ఉల్ హక్, ఫఖర్ జమాన్ రూపంలో మంచి ఓపెనర్లు ఉండగా.. మిడిలార్డర్లో కెప్టెన్ బాబర్ ఆజమ్, వికెట్ కీపర్ మహమ్మద్ రిజ్వాన్ మంచి టచ్లో ఉన్నారు. ఉప్పల్లో న్యూజిలాండ్తో జరిగిన పోరులో రిజ్వాన్ శతక్కొట్టగా.. ఆసీస్పై బాబర్ ఆజమ్ చక్కటి ఇన్నింగ్స్ ఆడాడు. ఇక హైదరాబాద్ వాతావరణం తమకు ఎంతగానో నచ్చిందని పదే పదే చెప్తున్న పాక్ ప్లేయర్లు.. రావల్పిండిని తలపిస్తున్న ఫ్లాట్ పిచ్పై నెదర్లాండ్స్ను చీల్చి చెండాడేందుకు సిద్ధం అవుతున్నారు. ‘బౌండ్రీలు చిన్నవి కావడంతో.. బౌలర్లు ఏ ఒక్క తప్పిదం చేసినా మూల్యం చెల్లించుకోవాల్సిందే. భారీ స్కోర్లు ఖాయమే. అందుకు తగ్గట్లే ఆడాల్సి ఉంటుంది’ అని పాక్ సారథి బాబర్ ఆజమ్ మ్యాచ్కు ముందు రోజే బౌలర్లకు హెచ్చరికలు జారీచేశాడు.
క్వాలిఫయింగ్ టోర్నీ ద్వారా వన్డే ప్రపంచకప్నకు అర్హత సాధించిన నెదర్లాండ్స్ జట్టులో స్టార్ ప్లేయర్లు లేకపోయినా.. ఆ జట్టులోనూ ప్రతిభగల ఆటగాళ్లకు కొదవలేదు. కెప్టెన్ స్కాట్ ఎడ్వర్ట్స్, మ్యాక్స్ డౌడ్, బాస్ డి లీడ్, విక్రమ్జిత్ సింగ్తో పాటు విజయవాడ వాసి తేజా నిడమనూరు కూడా మంచి ఆటగాడే. అయితే అతడికి తుది జట్టులో చోటు దక్కుతుందా లేదా అనేది చూడాలి. ఇప్పటి వరకు వరల్డ్కప్లో రెండు విజయాలు మాత్రమే సాధించిన నెదర్లాండ్స్ ఈ సారి బలమైన ముద్ర వేసేందుకు సన్నద్ధమై భారత్లో అడుగుపెట్టింది.