సిడ్నీ: టీ20 ప్రపంచకప్లో పాకిస్థాన్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. వరుస విజయాల జోరు కొనసాగిస్తూ మెగాటోర్నీల్లో న్యూజిలాండ్పై తమ గెలుపు ప్రస్థానాన్ని కొనసాగించింది. బుధవారం జరిగిన తొలి సెమీస్లో పాక్ 7 వికెట్ల తేడాతో కివీస్పై ఘన విజయం సాధించింది. దీని ద్వారా 13 ఏండ్ల తర్వాత టైటిల్ పోరుకు పాక్ అర్హత సాధించింది. 2007లో భారత్ చేతిలో ఓటమిపాలైన పాక్..2009లో టైటిల్ విజేతగా నిలిచింది. మ్యాచ్ విషయానికొస్తే.. ‘సెమీస్ టీమ్’ పేరును సార్థకం చేసుకుంటూ కివీస్ ఫైనల్ పోరుకు ముందు బోల్తాకొడితే..అసలు నాకౌట్కు అర్హత సాధిస్తుందా అనుకున్న పాకిస్థాన్ ఏకంగా ఫైనల్ పోరులో నిలువడం పొట్టి ఫార్మాట్ మజా ఏంటో మరోమారు తెలిసొచ్చింది. కివీస్ నిర్దేశించిన 153 పరుగుల లక్ష్యాన్ని మరో ఐదు బంతులు మిగిలుండగానే పాక్ 3 వికెట్లు కోల్పోయి విజయాన్నందుకుంది. ఓపెనర్లు బాబర్ ఆజమ్(53), మహమ్మద్ రిజ్వాన్(57) అర్ధసెంచరీలతో ఆకట్టుకున్నారు. కివీస్ బౌలింగ్ దాడిని సమర్థంగా తిప్పికొడుతూ జట్టుకు అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు. వీరిద్దరు తొలి వికెట్కు 105 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. మహమ్మద్ హారిస్(30) దూకుడుగా ఆడి గెలుపు లాంఛనాన్ని పూర్తి చేశాడు. బౌల్ట్(2/33)రెండు వికెట్లు తీశాడు. అంతకుముందు డారిల్ మిచెల్(53 నాటౌట్), విలియమ్సన్(46) రాణించడంతో కివీస్ 20 ఓవర్లలో 152/4 స్కోరు చేసింది. అలెన్(4), ఫిలిప్స్(6) నిరాశపరిచారు. రిజ్వాన్కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ దక్కింది.