CAA | పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)ను అమలు చేస్తూ కేంద్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు వెలువరించిన నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ క్రికెటర్ దానిష్ కనేరియా హర్షం వ్యక్తం చేశాడు. ఈ నిర్ణయం వల్ల పాకిస్తాన్లో ఉంటున్న హిందూవులు స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటున్నారని ట్విటర్ (ఎక్స్) వేదికగా స్పందించాడు. సీఏఏను అమలుచేసినందుకు గాను ప్రధానిమంత్రి నరేంద్ర మోడీతో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు కనేరియా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపాడు.
కేంద్రం సీఏఏ అమలు ప్రకటన వెలువరించిన తర్వాత కొద్దిసేపటికి కనేరియా ట్విటర్ వేదికగా స్పందిస్తూ.. ‘పాకిస్తాన్ లోని హిందువులు ఇప్పుడు స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటారు. పౌరసత్వ సవరణ చట్టాన్ని నోటిఫై చేసినందుకు పీఎం మోడీ, అమిత్ షా లకు కృతజ్ఞతలు’ అని రాసుకొచ్చాడు. సీఏఏపై 2019లో భారత్తో పాటు ఇతర దేశాల్లో విమర్శలు వెల్లువెత్తగా కనేరియా మాత్రం ఈ చట్టానికి మద్దతుగా నిలిచాడు. పాకిస్తాన్లోని సింధ్లో జన్మించిన కనేరియా.. ఆ దేశంలో రెండో హిందూ క్రికెటర్ (అంతకుముందు అనిల్ దల్పట్). 2000 నుంచి 2010 వరకూ పాక్ తరఫున 61 టెస్టులు, 18 వన్డేలు ఆడాడు. టెస్టులలో అతడి ఖాతాలో 261 వికెట్లు ఉన్నాయి.
Pakistani Hindus will now be able to breathe in open air. #CAA
— Danish Kaneria (@DanishKaneria61) March 11, 2024
Thank you @narendramodi ji and @AmitShah ji for notifying Citizenship Amendment Act.
— Danish Kaneria (@DanishKaneria61) March 11, 2024
2019లోనే కేంద్రం తీసుకొచ్చిన ఈ చట్టంపై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తడంతో పాటు కరోనా కారణంగా వాయిదా పడుతూ వస్తున్న పౌరసత్వ సవరణ బిల్లును కేంద్ర ప్రభుత్వం ఉన్నఫళంగా నిన్న సాయంత్రం నోటిఫై చేస్తున్నట్టు ప్రకటించింది. దీనిపై దేశవ్యాప్తంగా బిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బీజేపీ పాలనలోని రాష్ట్రాలు దీనిని అమలుచేయబోమంటూ ఇప్పటికే ప్రకటనలు చేశాయి. పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్లలో మతపరమైన హింస ఎదుర్కుని వలసవచ్చిన హిందువులు, సిక్కులు, బౌద్ధులు, జైనులు, పార్సీలు, క్రిస్టియన్ మతస్తులను భారత్ పౌరసత్వం ఇచ్చేందుకు గాను సీఏఏను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. శరణార్థుల వద్ద ఎలాంటి ధ్రువపత్రాలు లేనప్పటికీ వాళ్లకు భారత పౌరసత్వం ఇవ్వడం ఈ చట్టం ఉద్దేశం. 2014 డిసెంబర్ 31 కంటే ముందు భారత్కు శరణార్థులుగా వచ్చినవారందరూ దీనికి అర్హులే..