నల్లగొండ, ఏప్రిల్ 27 : 14 సంవత్సరాలు పోరాటం చేసి తెలంగాణను సాధించిన కేసీఆర్ ఈ రాష్ట్రాన్ని పదేండ్ల అధికారంలో అద్భుతంగా తీర్చిదిద్దితే కాంగ్రెస్ సర్కార్ వచ్చి నాలుగు నెలల్లో సర్వనాశనం చేసిందని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ ఆవిర్బావ దినోత్సవం సందర్భంగా శనివారం నల్లగొండలోని జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యమ కారులు, బీఆర్ఎస్ సేనకు శుభాకాంక్షలు తెలిపారు.
అంతకుముందు బీఆర్ఎస్ జెండాను పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ మాజీ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, నాయకుల సమక్షంలో ఎగురవేశారు. ఈ సందర్భంగా జగదీశ్రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం మరోసారి ఉద్యమం చేయాల్సిన అవసరం వచ్చిందన్నారు. మన నీళ్ల్లు, నిధులు, నియామకాలు మనకే ఉండాలని కేసీఆర్ ఉద్యమం చేస్తున్న సందర్భంలో ఆయన వల్ల ఏమయితదని అందరూ అనుకున్నారని, కానీ చావునే జయించి ఈ రాష్ర్టాన్ని సాధించిన వ్యక్తిగా కేసీఆర్ చరిత్రలో నిలిచారని తెలిపారు. సీఎంగా కేసీఆర్ తెలంగాణ రాష్ర్టాన్ని పదేండ్లలో అన్ని రంగాల్లో అభివృద్ధి చేశారని చెప్పారు.
ఆకలి చావులు, ఆత్మహత్యలు లేని తెలంగాణగా మార్చి వ్యవసాయ రంగాన్ని సస్యశ్యామలం చేశారని తెలిపారు. మూడు లక్షల మెట్రిక్ టన్నుల నుంచి 40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండించే విధంగా నల్లగొండను అభివృద్ధి చేసినట్లు చెప్పారు. నల్లగొండ జిల్లా ప్రజలు కేసీఆర్ రుణం తీర్చుకోవాలని ఆరాట పడుతున్నారని, ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని రెండు ఎంపీ సీట్లు గెలిపించి కేసీఆర్కు బహుమతి ఇస్తామని అన్నారు. తెలంగాణ రాష్ట్రం మళ్లీ గాడిలో పడాలంటే కేసీఆర్ రావాల్సిందేనని, లేదంటే ఈ రాష్ట్రం ఆగమయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు. పార్లమెంట్ ఎన్నికలతో కాంగ్రెస్ నుంచి నల్లగొండ జిల్లాకు విముక్తి కల్పిస్తామని తెలిపారు.
పంద్రాగస్టులోపు రెండు లక్షల రుణమాఫీ చేస్తే హరీశ్రావు తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారని, సీఎం రేవంత్, మంత్రి కోమటిరెడ్డికి ఏ పద్ధతిలో రాజీనామా కావాలో చెప్తే అదే పద్ధతిలో
అందజేస్తామని ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి తెలిపారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చిల్లర మాటలు ప్రజలకు తెలుసని, ఆయన ఎప్పుడూ ఒకే మాటపై ఉండరని విమర్శించారు. రేవంత్ రెడ్డికి పీసీసీ ఇస్తే గాంధీ భవన్ను తొక్కనని అన్న కోమటిరెడ్డి ఇయ్యాల సీఎం బూట్లు తుడిచేందుకు అన్న దమ్ములు ఎందుకు పోటీ పడుతున్నారని ప్రశ్నించారు.
బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడిగా దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ను కేసీఆర్ గతంలోనే నియమించినప్పటికీ జిల్లా కేంద్రంలోని ఆ పార్టీ కార్యాలయంలో నిర్మాణం పూర్తి స్థాయిలో కాలేదు. ఇటీవల అది పూర్తి కావడంతో శనివారం ఆవిర్భావ వేడుకల సందర్భంగా ఆయన జిల్లా అధ్యక్షుడి హోదాను స్వీకరించారు. ఈ సందర్బంగా మాజీ మంత్రి జగదీశ్రెడ్డితోపాటు జడ్పీ చైర్మన్ బండ నరేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ ఎంసీ కోటి రెడ్డి, బీఆర్ఎస్ నల్లగొండ పార్లమెంట్ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డి,
మాజీ ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్ రెడ్డి, నల్లమోతు భాస్కర్ రావు, చిరుమర్తి లింగయ్య అభినందించారు. ఈ కార్యక్రమంలో నల్లగొండ మాజీ మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, మాజీ కార్పొరేషన్ చైర్మన్ రాంచందర్ నాయక్, నాయకులు తిప్పన విజయసింహా రెడ్డి, చింతరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, కటికం సత్తయ్య గౌడ్, పంకజ్ యాదవ్, బక్క పిచ్చయ్య, బకరం వెంకన్న, మైనం శ్రీనివాస్, నిరంజన్ వలీ, కరీం పాషా, రావుల శ్రీనివాస్ రెడ్డి, జయప్రద, స్వరూప పాల్గొన్నారు.