సెమీస్ రేసులో నిలువాలంటే తప్పక నెగ్గాల్సిన మ్యాచ్లో పాకిస్థాన్ విజృంభించింది. మొదట బ్యాట్తో భారీ స్కోరు చేసిన పాక్.. ఆ తర్వాత బంతితో రెచ్చిపోయింది. తొలి రెండు మ్యాచ్ల్లో ఓడి డీలాపడ్డ పాకిస్థాన్కు సఫారీలతో పోరులో వరుణుడు కూడా సహాయపడ్డాడు. లోయర్ ఆర్డర్లో ఆకాశమే హద్దుగా చెలరేగిన షాదాబ్ ఖాన్ మెరుపు అర్ధశతకంతో రాణించగా.. బౌలింగ్లో షాదాబ్తో పాటు షాహీన్ అఫ్రిది సత్తాచాటడంతో గ్రూప్-2 సెమీస్ రేసు రసవత్తరంగా మారింది.
సిడ్నీ: ఆరంభంలో వరుస పరాజయాలతో డీలా పడ్డ పాకిస్థాన్.. టీ20 ప్రపంచకప్లో రెండో విజయంతో సెమీస్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. షాదాబ్ ఖాన్ ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టడంతో పాకిస్థాన్ 33 పరుగుల తేడాతో (డక్ వర్త్ లూయిస్ పద్ధతిలో) దక్షిణాఫ్రికాపై విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది. టాపార్డర్ పెద్దగా ఆకట్టుకోలేకపోయిన చోట.. షాదాబ్ ఖాన్ (22 బంతుల్లో 52; 3 ఫోర్లు, 4 సిక్సర్లు), ఇఫ్తిఖార్ అహ్మద్ (35 బంతుల్లో 51; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధశతకాలతో కదంతొక్కారు.
దక్షిణాఫ్రికా బౌలర్లలో నోర్జే 4 వికెట్లు పడగొట్టాడు. అనంతరం చేజింగ్లో దక్షిణాఫ్రికా 9 ఓవర్లలో 69/4తో నిలిచిన సమయంలో మ్యాచ్కు వర్షం అంతరాయం కలిగించడంతో లక్ష్యాన్ని 14 ఓవర్లలో 142కు కుదించారు. అయితే అప్పటికే జోరుమీదున్న పాక్ బౌలర్లు వర్షం విరామం అనంతరం మరింత రెచ్చిపోవడంతో సఫారీ జట్టు చివరికి 14 ఓవర్లలో 9 వికెట్లకు 108 పరుగులకు పరిమితమైంది. కెప్టెన్ బవుమా (36) టాప్ స్కోరర్. పాక్ బౌలర్లలో షాహీన్ అఫ్రిది 3, షాదాబ్ ఖాన్ రెండు వికెట్లు పడగొట్టారు. షాదాబ్కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.
దక్షిణాఫ్రికాపై పాకిస్థాన్ విజయం సాధించడంతో గ్రూప్-2 రేసు రసవత్తరంగా మారింది. గ్రూప్లో అన్నీ జట్లు నాలుగేసి మ్యాచ్లు ఆడగా.. మూడు విజయాలతో 6 పాయింట్లు ఖాతాలో వేసుకున్న భారత్ టాప్లో నిలిచింది. దక్షిణాఫ్రికా (5), పాకిస్థాన్ (4), బంగ్లాదేశ్ (4) వరుసగా ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఇక లీగ్ దశ చివరి రోజు ఆదివారం గ్రూప్-2 నుంచి ఆరు జట్లు మూడు మ్యాచ్ల్లో తలపడనుండగా.. ఆ రోజే సెమీఫైనల్ బెర్త్లు ఖరారు కానున్నాయి.