వరల్డ్కప్లో నాలుగొందల పైచిలుకు పరుగులు చేసిన తర్వాత పరాజయం పాలైన తొలి జట్టుగా న్యూజిలాండ్ నిలిచింది.
ప్రపంచకప్లో న్యూజిలాండ్కు ఇదే (401/6) అత్యధిక స్కోరు.
అనిశ్చితికి మారుపేరైన పాకిస్థాన్.. వరల్డ్కప్లో అత్యవసర విజయాన్ని ఖాతాలో వేసుకుంది. 1992 ప్రపంచకప్ తరహాలో వర్షానికి, అదృష్టం తోడవడంతో.. నాలుగో విజయంతో సెమీస్ రేసులో నిలిచింది. పరుగుల వరద పారిన పోరులో మొదట రచిన్ రవీంద్ర, విలియమ్సన్ దంచికొడితే.. ఆనక పాక్ ఓపెనర్ జమాన్ బంతిపై పగబట్టినట్లు శివతాండవమాడాడు. డక్వర్త్ లూయిస్ పద్ధతితో పాక్కు విజయ సమీకరణం సులువు కాగా.. నాలుగొందల పైచిలుకు స్కోరు చేసినా కివీస్కు వరుసగా నాలుగో ఓటమి తప్పలేదు!
బెంగళూరు: సెమీఫైనల్ రేసులో నిలువాలంటే తప్పక నెగ్గాల్సిన మ్యాచ్లో పాకిస్థాన్ సత్తాచాటింది. పరుగుల వరద పారిన పోరులో అదృష్టం వరుణుడి రూపంలో తోడవడంతో వన్డే ప్రపంచకప్లో పాక్ నాలుగో విజయం ఖాతాలో వేసుకుంది. శనివారం జరిగిన తొలి పోరులో పాకిస్థాన్ 21 పరుగుల తేడాతో (డక్వర్త్ లూయిస్ పద్ధతిలో) న్యూజిలాండ్ను చిత్తు చేసింది. దీంతో ఆడిన ఎనిమిది మ్యాచ్ల్లో 8 పాయింట్లు ఖాతాలో వేసుకున్న పాకిస్థాన్ పట్టికలో ఐదో స్థానంలో నిలువగా.. వరుసగా నాలుగో ఓటమి మూటగట్టుకున్న న్యూజిలాండ్ నిలకడగా నాలుగో ప్లేస్లో కొనసాగుతున్నది.
చిన్నస్వామి స్టేడియంలో టాస్ ఓడి మొదట బ్యాటింగ్కు దిగిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 401 పరుగులు చేసింది. రచిన్ రవీంద్ర (108; 15 ఫోర్లు, ఒక సిక్సర్) మరో సెంచరీతో చెలరేగితే.. గాయం నుంచి కోలుకొని వచ్చిన కెప్టెన్ కేన్ విలియమ్సన్ (79 బంతుల్లో 95; 10 ఫోర్లు, 2 సిక్సర్లు) విలువైన ఇన్నింగ్స్ ఆడాడు. గ్లెన్ ఫిలిప్స్ (41), మార్క్ చాప్మన్ (39), కాన్వే (35) కూడా రాణించారు. పాకిస్థాన్ బౌలర్లలో వసీమ్ 3 వికెట్లు పడగొట్టాడు. అనంతరం పాకిస్థాన్ దంచికొడుతున్న సమయంలో మ్యాచ్కు వర్షం ఆటంకం కలిగించింది. దీంతో మొదట పాక్ లక్ష్యాన్ని 41 ఓవర్లలో 342కు కుదించినా.. మరోసారి వరుణుడు అడ్డుపడ్డాడు. అప్పటికి బాబర్ సేన 25.3 ఓవర్లలో వికెట్ నష్టానికి 200 పరుగులు చేసి డక్వర్త్ లూయిస్ ప్రకారం 21 పరుగులు ముందంజలో నిలువడంతో.. పాకిస్థాన్ను విజేతగా ప్రకటించారు. ఓపెనర్ ఫఖర్ జమాన్ (81 బంతుల్లో 126 నాటౌట్; 8 ఫోర్లు, 11 సిక్సర్లు) కివీస్ బౌలర్లతో చెడుగుడు ఆడుకోగా.. కెప్టెన్ బాబర్ ఆజమ్ (66 నాటౌట్; 6 ఫోర్లు, 2 సిక్సర్లు) ఆకట్టుకున్నాడు. ఫఖర్కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ దక్కింది.
1992 వన్డే ప్రపంచకప్లో పాకిస్థాన్ దాదాపు ఇలాంటి పరిస్థితే ఎదుర్కొంది. ఇమ్రాన్ ఖాన్ సారథ్యంలో బరిలోకి దిగిన పాక్.. లీగ్ దశలో ఆడిన 8 మ్యాచ్ల్లో నాలుగింట మాత్రమే నెగ్గింది. ఆ టోర్నీ కూడా రౌండ్ రాబిన్ పద్ధతిలోనే జరగగా.. జింబాబ్వే, ఆస్ట్రేలియా, శ్రీలంక, న్యూజిలాండ్పై పాక్ నెగ్గింది. ఇంగ్లండ్తో మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కాగా.. ఆ పోరులో పాక్ జట్టు 74 పరుగులకే ఆలౌటైంది. లక్ష్యఛేదనలో ఇంగ్లండ్ విజ యం నల్లేరుపై నడకే అనుకుంటే.. భారీ వర్షం వల్ల మ్యాచ్ తుడిచిపెట్టుకుపోయింది. అలా అనుకోకుండా అదృష్టం కలిసి వచ్చి 9 పాయింట్లతో నాకౌట్ దశకు చేరిన పాకిస్థాన్.. సెమీస్లో న్యూజిలాండ్పై ఫైనల్లో ఇంగ్లండ్పై గెలిచి.. తొలిసారి విశ్వ విజేతగా అవతరించింది.
న్యూజిలాండ్: 401/6 (రచిన్ 108, విలియమ్సన్ 95; వసీమ్ 3/60),
పాకిస్థాన్: 25.3 ఓవర్లలో 200/1 (ఫఖర్ 126 నాటౌట్, బాబర్ 66 నాటౌట్; సౌథీ 1/27).