waqar younis : వన్డే ప్రపంచ కప్(ODI World Cup)లో దాయాది పాకిస్థాన్(Pakistan)పై టీమిండియా(Team Inida)కు ఘనమైన రికార్డు ఉన్న విషయం తెలిసిందే. ఇప్పటివరకూ భారత్ చేతిలో ఏడుసార్లు పాకిస్థాన్ జట్టు పరాజయం పాలైంది. అయితే.. ఈసారి మాత్రం తమ జట్టు కచ్చితంగా గెలిచి తీరుతుందని ఆ దేశ మాజీ కెప్టెన్ వకార్ యూనిస్(waqar younis) జోస్యం చెప్పాడు. ప్రస్తుత జట్టులో మ్యాచ్ విన్నర్లు ఎక్కువ మంది ఉన్నారని, స్వదేశంలో భారత్ను ఓడించే సత్తా తమ జట్టుకు ఉందని వకార్ అంటున్నాడు.
‘మా కాలంలో ఇంత ఒత్తిడి లేదు. కానీ ఇతర జట్లతో పోల్చుకుంటే.. భారత్, పాకిస్థాన్ పోరంటే ఉండే ఆసక్తి ప్రత్యేకం. అది మినీ యుద్ధాన్ని తలపిస్తుంది. ప్రపంచ కప్ గెలువకపోయినా పర్వాలేదు కానీ భారత్ చేతిలో ఓడిపోకూడదని బోర్డు అధికారులు సూచించేవాళ్లు. అయినా ప్రపంచ కప్ అనేసరికి టీమిండియా చేతిలో ఓడేవాళ్లం. ప్రస్తుతం పరిస్థితులు మారాయి. ఇప్పుడు జట్టులో చాలా మంది మ్యాచ్ విన్నర్లు ఉన్నారు’ అని వకార్ పేర్కొన్నాడు.
అక్టోబర్ 5 నుంచి వన్డే ప్రపంచకప్ ప్రారంభం కానుండగా.. అంతకుముందే భారత్, పాకిస్థాన్ ఆసియా కప్లో అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ నేపథ్యంలో వకార్ మాట్లాడుతూ.. ‘పాక్ ప్లేయర్లు ప్రస్తుతం వేర్వేరు లీగ్ల్లో ఆడుతూ అంతర్జాతీయ అనుభవం గడిస్తున్నారు. ఒత్తిడిని ఎలా అధిగమించాలో బాగా నేర్చుకున్నారు. 2021 టీ20 ప్రపంచకప్లో భారత్పై నెగ్గాం. దాన్నే కొనసాగిస్తాం. కెప్టెన్ బాబర్ ఆజమ్తో పాటు షాహీన్ అఫ్రిది, ఇమామ్ ఉల్ హక్, మహమ్మద్ రిజ్వాన్, ఫకర్ జామన్.. ఇలా చాలా మంది మ్యాచ్ విన్నర్లు ఈసారి పాకిస్థాన్ జట్టులో ఉన్నారు’ అని వివరించాడు. వన్డే, టీ20 ప్రపంచ కప్లలో కలిపి భారత్పై పాకిస్థాన్ ఒకే ఒక్కసారే (2021 టీ20 ప్రపంచ కప్లో) గెలిచింది.