India Vs SA ODI | దక్షిణాఫ్రికాపై జరుగుతున్న తొలి వన్డేలో 250 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీం ఇండియా తడబాటుకు గురైంది. మూడో ఓవర్ నాలుగో బంతికి ఓపెనర్ శుభ్మన్ గిల్.. దక్షిణాఫ్రికా బౌలర్ రబడా చేతిలో బౌల్డయ్యాడు. అప్పటికి టీం ఇండియా స్కోర్ కేవలం ఎనిమిది పరుగులే. అంతకుముందు నిర్ణీత 40 ఓవర్లు పూర్తయ్యే సరికి సఫారీలు నాలుగు వికెట్లు కోల్పోయి 249 పరుగులు చేశారు. ఐదో వికెట్ భాగస్వామ్యానికి డేవిడ్ మిల్లర్, హెన్రిచ్ క్లాసిన్ 139 పరుగులు జత చేశారు. డీకాక్ ఔటైన తర్వాత దూకుడుగా ఆడిన క్లాసిన్ పరుగుల వేగం పెంచాడు. డేవిడ్ మిల్లర్ 63 బంతుల్లో ఐదు ఫోర్లు, మూడు సిక్సర్లతో 75 పరుగులు చేశాడు. అలాగే క్లాసిన్ కూడా 65 బంతుల్లో ఆరు ఫోర్లు రెండు సిక్సర్లతో 74 పరుగులు చేశాడు.
మరోవైపు టీం ఇండియా ఆటగాళ్ల నిర్లక్ష్యం కూడా ఫీల్డింగ్లో కొట్టొచ్చినట్లు కనిపించింది. ఫలితంగా మిల్లర్, క్లాసిన్లకు పలు దఫాలు లైఫ్లైన్లు లభించాయి. దీంతో వారిద్దరూ చెలరేగిపోయారు. వారి జోడీని విడదీసేందుకు టీం ఇండియా బౌలర్లు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.
అంతకుముందు నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో చిక్కుకున్న దక్షిణాఫ్రికాను డేవిడ్ మిల్లర్ ఆదుకున్నాడు. డికాక్ ఔటైన తర్వాత బ్యాటింగ్కు వచ్చిన డేవిడ్ మిల్లర్.. హెన్రిచ్ క్లాసిన్తో కలిసి జట్టు స్కోర్ పెంచుతూ వచ్చాడు. తొలి వన్డేలో 21 ఓవర్లు పూర్తయ్యేసరికి 110 పరుగులు చేసింది. కానీ తర్వాత డేవిడ్ మిల్లర్, క్లాసిన్ జోడీ నిలకడగా ఆడుతూ ముందుకు సాగింది. 36వ ఓవర్లో మిల్లర్, క్లాసిన్ అర్థ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. 36వ ఓవర్ చివరి బంతిని ఎక్స్ట్రా కవర్ మీదుగా పెవిలియన్ దారి పట్టించి సిక్సర్ కొట్టాడు క్లాసిన్. 36 ఓవర్లు ముగిసే సరికి దక్షిణాఫ్రికా నాలుగు వికెట్లు కోల్పోయి 207 పరుగులు చేసింది.