టోక్యో: కరోనా మహమ్మారి కారణంగా ఈసారి ఒలింపిక్ గేమ్స్ ఓపెనింగ్ సెర్మనీలో కేవలం 44 మంది భారత అథ్లెట్లనే అనుమతించనున్నారు. దీంతో ఈ సెర్మనీ మరుసటి రోజే గేమ్స్లో ఆడాల్సి ఉన్న అథ్లెట్లను పక్కన పెట్టేశారు. ఆరుగురు అధికారులను కలిపితే ఇండియా సభ్యుల సంఖ్య 50కి చేరనుంది. తమ అథ్లెట్లను అనవసరంగా ముప్పులోకి నెట్టకూడదన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ సెక్రటరీ జనరల్ రాజీవ్ మెహతా వెల్లడించారు. టోక్యోలోని టీమ్ మేనేజ్మెంట్, కోచ్లతో మాట్లాడిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఈసారి ఎన్నడూ లేని విధంగా ఇండియా నుంచి 127 మంది అథ్లెట్లు పాల్గొంటున్నారు. అధికారులు, కోచ్లు, ఇతర సహాయ సిబ్బందిని కలిపితే వీళ్ల సంఖ్య 228కి చేరుతుంది. నిజానికి ఓపెనింగ్ సెర్మనీలో ఆరుగురు అధికారులకే అవకాశం ఉన్నా.. అథ్లెట్ల సంఖ్యపై పరిమితి లేదు. అయితే మరుసటి రోజు ఈవెంట్స్ ఉన్న అథ్లెట్లను సెర్మనీకి దూరంగా ఉంచి వాళ్ల ఆటలపై దృష్టి సారించాలని సూచించాం అని డిప్యూటీ చెప్ డి మిషన్ ప్రేమ్ కుమార్ వర్మ చెప్పారు.
ఈ నిర్ణయంతో షూటర్లు సౌరభ్ చౌదరి, అభిషేక్ వర్మలాంటి వాళ్లు సెర్మనీకి దూరం కానున్నారు. ఇక ఓపెనింగ్ సెర్మనీలో హాకీ టీమ్ కెప్టెన్ మన్ప్రీత్ సింగ్, మేరీ కోమ్ భారత జాతీయ పతాకాన్ని పట్టుకొని ముందు నడవనున్నారు. నిజానికి మరుసటి రోజే హాకీ కెప్టెన్ మన్ప్రీత్ మ్యాచ్ ఆడాల్సి ఉంది. అటు యూకే కూడా 376 మంది అథ్లెట్లను పంపించినా కేవలం 30 మందిని మాత్రమే సెర్మనీకి అనుమతించింది.