One Day World cup | ఆతిథ్యంలో సముచిత స్థానం దక్కలేదు. టీమ్ఇండియా ఆడే ఒక్క మ్యాచ్ను కూడా నగరానికి కేటాయించని ఐసీసీ.. మూడంటే మూడు మ్యాచ్లు ఇచ్చి చేతులు దులుపుకుంది. బీసీసీఐ కార్యదర్శిగా ఉన్న కేంద్ర హోంమంత్రి అమిత్షా కుమారుడు జై షా.. ముఖ్యమైన మ్యాచ్లన్నీ గుజరాత్కు తరలించుకుపోయాడు. మెగాటోర్నీ ఆరంభ, ముగింపు సమరాలతో పాటు.. అభిమానులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న భారత్, పాకిస్థాన్ మ్యాచ్ కూడా అహ్మదాబాద్లోనే జరుగనుంది. దీనిపై విపక్ష నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తుండగా.. ముష్టి మూడు మ్యాచ్లు కేటాయించారని సామాజిక మాధ్యమాల్లో అభిమానులు విమర్శలు గుప్పిస్తున్నారు!
ముంబై: అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వన్డే ప్రపంచకప్ షెడ్యూల్ విడుదలైంది. పుష్కర కాలం తర్వాత భారత్లో జరుగనున్న మెగాటోర్నీకి అక్టోబర్ 5న తెరలేవనుండగా.. నవంబర్ 19న జరుగనున్న ఫైనల్తో వరల్డ్కప్ ముగియనుంది. డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్, రన్నరప్ న్యూజిలాండ్ మధ్య జరుగనున్న తొలి పోరుకు ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ మైదానమైన అహ్మదాబాద్ వేదిక కానుంది. అక్టోబర్ 8న చెన్నై వేదికగా ఆస్ట్రేలియాతో జరుగనున్న పోరుతో టీమ్ఇండియా ప్రపంచకప్ వేట ప్రారంభించనుంది. నవంబర్ 15న తొలి సెమీఫైనల్కు ముంబై, 16న రెండో సెమీఫైనల్కు కోల్కతా ఆతిథ్యమివ్వనుండగా.. ఫైనల్ అహ్మదాబాద్ స్టేడియంలో నిర్వహించనున్నారు. మొత్తం 10 వేదిక (హైదరాబాద్, అహ్మదాబాద్, ధర్మశాల, ఢిల్లీ, చెన్నై, లక్నో, పుణె, బెంగళూరు, ముంబై, కోల్కతా)ల్లో మెగాటోర్నీ జరుగనుండగా.. తొలిసారి ఈశాన్య రాష్ర్టాల్లోని గువాహటిలో ప్రపంచకప్ వామప్ మ్యాచ్లు జరుగనున్నాయి. అఫ్గానిస్థాన్తో తమ మ్యాచ్ వేదిక మార్చమని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు కోరినా.. ఐసీసీ దాన్ని పట్టించుకోలేదు.
రౌండ్ రాబిన్ పద్ధతిలో..
మొత్తం పది జట్లు పాల్గొననున్న ఈ మెగాటోర్నీని రౌండ్ రాబిన్ పద్ధతిలో నిర్వహించనున్నారు. ఇప్పటికే 8 జట్లు నేరుగా వరల్డ్కప్నకు అర్హత సాధించగా.. క్వాలిఫయింగ్ టోర్నీలో సత్తాచాటిన రెండు జట్లు మెగాటోర్నీ బరిలో దిగనున్నాయి. లీగ్ దశలో ప్రతి జట్టు మిగిలిన అన్నీ జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడనుండగా.. మొత్తం 45 మ్యాచ్లు జరుగనున్నాయి. అనంతరం సెమీఫైనల్, ఫైనల్ మ్యాచ్లు నిర్వహించనున్నారు.
9 వేర్వేరు మైదానాల్లో..
వన్డే ప్రపంచకప్లో భారత్ తొలి మ్యాచ్లో ఆస్ట్రేలియాతో తలపడనుండగా.. లీగ్ దశలో తొమ్మిది మ్యాచ్లను తొమ్మిది వేర్వేరు వేదికలపై ఆడనుంది. దీని కోసం రోహిత్ సేన 8400 కిలోమీటర్ల దూరం ప్రయాణించనుంది. భారత్లో చివరిసారిగా (2011) జరిగిన వన్డే ప్రపంచకప్లో టీమ్ఇండియా విజేతగా నిలువగా.. ఈసారి కూడా అదే సీన్ రిపీట్ కావాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.
ఎందుకీ వివక్ష
ఉప్పల్ మైదానాన్ని ప్రపంచకప్ వేదికల్లో ఒకటిగా ప్రకటించడంతో.. ఆనందంలో మునిగి తేలిన హైదరాబాదీలకు ఐసీసీ షాక్ ఇచ్చింది. భారత్ ఆడే ఒక్క మ్యాచ్కు కూడా ఈ మైదానాన్ని కేటాయించని ఐసీసీ.. అప్రధాన్యమైన మూడు మ్యాచ్లను నిర్వహించనుంది. దీంతో పాకిస్థాన్, న్యూజిలాండ్తో పాటు క్వాలిఫయింగ్ టోర్నీలో సత్తాచాటిన రెండు జట్లు ఇక్కడ మ్యాచ్లు ఆడనున్నాయి. టోర్నీ ఆరంభానికి ముందు నిర్వహించనున్న వార్మప్ మ్యాచ్లను హైదరాబాద్తో పాటు గువాహటి, తిరువనంతపురంలో నిర్వహించాలని ఐసీసీ నిర్ణయించింది. ప్రధాన మ్యాచ్లన్నీ అహ్మదాబాద్కే కేటాయించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.
అక్టోబర్ 15న దాయాదుల పోరు
యావత్ క్రీడా ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారత్, పాకిస్థాన్ పోరుకు అహ్మదాబాద్ వేదిక కానుంది. అక్టోబర్ 15న చిరకాల ప్రత్యర్థులు అమీతుమీ తేల్చుకోనున్నారు. వన్డే ప్రపంచకప్లో ఇరు జట్లు ఇప్పటి వరకు ఏడుసార్లు ఎదురుపడగా.. అందులో ఏడింటా భారత్నే విజయం వరించింది.
కోహ్లీ కోసం కప్పు కొట్టాలి: సెహ్వాగ్
ముంబై: స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ కోసం ఈసారి భారత జట్టు ప్రపంచకప్ సాధించాలని మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ అన్నాడు. 2011లో సొంతగడ్డపై జరిగిన వన్డే వరల్డ్కప్ సమయంలో అప్పటి జట్టు సభ్యులంతా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కోసం ట్రోఫీ నెగ్గాలనుకున్నామని.. అది నిజమైందని సెహ్వాగ్ పేర్కొన్నాడు. మంగళవారం ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల నేపథ్యంలో సెహ్వాగ్ మాట్లాడుతూ.. ‘కోహ్లీ కూడా సచిన్ బాటలోనే పయనిస్తున్నాడు. ఈ సారి జట్టు సభ్యులు అతడి కోసం కప్పు సాధించాలి. ఆటపై విరాట్కు ఉన్న మక్కువ గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. అతడు మైదానంలో దిగాడంటే వంద శాతం కష్టపడతాడు. మెగాటోర్నీలో విరాట్ పరుగుల వరద పారిస్తాడని ఆశిస్తున్నా’ అని అన్నాడు. ఇక పాకిస్థాన్తో మ్యాచ్పై వీరు స్పందిస్తూ.. ఒత్తిడిని అధిగమించడంలో పాక్ కంటే టీమ్ఇండియానే మెరుగ్గా ఉందని వ్యాఖ్యానించాడు. రోహిత్ సేనకు ఇంగ్లండ్, ఆస్ట్రేలియా నుంచి కఠిన సవాల్ ఎదురయ్యే అవకాశం ఉందని పేర్కొన్నాడు.
ముంబై మ్యాచ్ ఫెవరేట్
స్వదేశం వేదికగా జరుగనున్న ప్రతిష్ఠాత్మక వ న్డే ప్రపంచకప్ టోర్నీ షెడ్యూల్పై స్టార్ బ్యాట ర్ విరాట్ కోహ్లీ తనదైన శైలిలో స్పందించాడు. మెగాటోర్నీ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాన్న కోహ్లీ ముంబై తన ఫెవరేట్ వేదిక అని చెప్పుకొచ్చాడు. ‘23 ఏండ్ల వయసులో ముంబైలో ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ ఆడాడు. కానీ ఆ సమయంలో సీనియర్ ప్లేయర్లపై ఉన్న అంచనాలు ఏంటో నాకు పెద్దగా తెలియదు. ఇప్పుడు ఒక సీనియర్ ప్లేయర్గా స్వదేశంలో ప్రపంచకప్ జరుగుతుంటే అభిమానుల అంచనాలు ఉంటాయో అర్థం చేసుకోగలను. 2011 ముంబైలో ఫైనల్ ఇప్పటికీ గుర్తు ఉంది. ముంబైలో ఆడటమంటే నాకు వ్యక్తిగతంగా చాలా ఇష్టం’ అని అన్నాడు.