CWC 2023: సంప్రదాయక టెస్టులు, నాలుగు గంటల్లో ముగిసే టీ20ల హోరులో వన్డేల భవిష్యత్ ఏంటి..? అందుకు భారత్ వేదికగా జరుగుతున్న వన్డే వరల్డ్ కప్ సమాధానాలు చెప్పగలదని గత కొంతకాలంగా క్రికెట్ విశ్లేషకులు చర్చోపచర్చలు చేస్తున్న విషయం తెలిసిందే. వన్డేల మీద బోర్ కొట్టిందని, ఈ ఫార్మాట్కు ఇక మనుగడ లేదని, బహుశా ఇదే ఆఖరి వన్డే వరల్డ్ కప్ అని చెప్పినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని కొంతమంది వాదించారు. కానీ ఆ అనుమానాలను పటాపంచలు చేస్తూ ఇండియాలో జరుగుతున్న ప్రపంచకప్ అంచనాలకు మించి సక్సెస్ అవుతోంది. గణాంకాలు చెబుతున్న వాస్తవం ఇది..
ప్రపంచకప్ మొదలయ్యాక భారత్ ఆడే మ్యాచ్లకు తప్ప మిగిలిన మ్యాచ్లకు స్టేడియాలలో జనం లేక ఖాళీ కుర్చీలు దర్శనమిచ్చిన మాట వాస్తవమే. కానీ మెగా టోర్నీలో సగం మ్యాచ్ (24) పూర్తైన తర్వాత తేలిన లెక్కల ప్రకారం.. ఈ ప్రపంచకప్ను స్టేడియాలలోకి వచ్చి చూసినవారు 5 లక్షల 42 వేల మంది. ఇది క్రికెట్ పుట్టినిల్లు అయిన ఇంగ్లండ్ వేదికగా జరిగిన గత ప్రపంచకప్ (2019)లో స్టేడియానికి వచ్చిన మొత్తం జనం (1,90,000) కంటే అధికం. ఇంకా సగం టోర్నీ మిగిలుండటం.. భారత్ సెమీస్ రేసులో ఉండటంతో ఈ సంఖ్య గణనీయంగా పెరిగే అవకాశముంది.
HISTORY.
5,42,000 fans attended World Cup 2023 in stadiums till midway of the tournament.
– It is more than 1,90,000 from the 2019 World Cup. pic.twitter.com/hGUTxiPtjf
— Johns. (@CricCrazyJohns) October 27, 2023
స్టేడియాలకు వచ్చినవారే కాదు వ్యూస్ పరంగా కూడా వన్డే వరల్డ్ కప్ రికార్డులు బ్రేక్ చేస్తోంది. ఈ మెగా టోర్నీలో 18 మ్యాచ్లు ముగిసేసరికి స్టార్ స్పోర్ట్స్లో 36.42 కోట్ల మంది వరల్డ్ కప్ ప్రత్యక్ష ప్రసారాలను వీక్షించారు. భారత్ – న్యూజిలాండ్ మ్యాచ్లో డిస్నీ హాట్ స్టార్లో వ్యూయర్ షిప్ ఏకంగా 4 కోట్లకు చేరి కొత్త రికార్డులు సృష్టించిన విషయం తెలిసిందే. నిన్న చెన్నై వేదికగా దక్షిణాఫ్రికా – పాకిస్తాన్ మధ్య ముగిసిన మ్యాచ్లో చెపాక్ స్టేడియం పూర్తిగా నిండిపోగా హాట్ స్టార్లో ఈ మ్యాచ్ను ఏకంగా రెండు కోట్ల మంది చూశారు. ధర్మశాలలో ఆస్ట్రేలియా – న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న మ్యాచ్లో కూడా స్టేడియం నిండిపోవడం విశేషం. వన్డేల భవితవ్యంపై ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో తాజా గణాంకాలు ఈ ఫార్మాట్ భవితపై భరోసానిచ్చేవే..