న్యూఢిల్లీ : ప్రపంచకప్ సందర్భంగా ప్రధాన నగరాలైన ఢిల్లీ, ముంబైలలో జరిగే మ్యాచ్లలో బాణసంచా కాల్చడంపై నిషేధం విధిస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. ఆ నగరాలలో నెలకొన్న తీవ్ర వాయు కాలుష్యం దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్టు బోర్డు కార్యదర్శి జై షా వెల్లడించారు.
ఢిల్లీ ఈ నెల 6న బంగ్లాదేశ్-శ్రీలంక మ్యాచ్కు ఆతిథ్యం ఇవ్వనుండగా, ముంబై 2, 7 తేదీలలో రెండు లీగ్ మ్యాచ్లు, 15న సెమీఫైనల్కు ఆతిథ్యం ఇవ్వనున్నది. ఢిల్లీలో వరుసగా అయిదో రోజు వాయుకాలుష్యం స్థాయి 372 ఎక్యుఐ(ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్)పాయింట్లు ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు ఆందోళన వ్యక్తంచేశారు. ముంబైలో కూడా కాలుష్యం తీవ్ర స్థాయిలో నెలకొనడంతో హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. దీనితో తమవంతు బాధ్యతగా బాణసంచాపై నిషేధం విధించినట్టు బీసీసీఐ బుధవారం ఒక ప్రకటనలో వెల్లడించింది.