Mohammed Siraj | ఆసియాకప్ ఫైనల్లో ఒంటి చేత్తో టీమ్ఇండియాకు విజయం కట్టబెట్టిన హైదరాబాదీ పేసర్ మహమ్మద్ సిరాజ్పై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఒకే ఓవర్లో 4 వికెట్లు సహా మొత్తం 6 వికెట్లు ఖాతాలో వేసుకున్న సిరాజ్.. లంకను 50 పరుగులకే ఆలౌట్ చేయడంలో కీలక పాత్ర పోషించగా.. ఆ తర్వాత సునాయాస లక్ష్యఛేదనలో ఓపెనర్లు దంచికొట్టడంతో టీమ్ఇండియా 6.1 ఓవర్లలోనే టార్గెట్ పూర్తిచేసింది.
ప్రత్యర్థి వన్నులో వణుకు పుట్టించే స్పెల్ ఎలా ఉంటుందో శ్రీలంకకు సిరాజ్ చూపించాడని పాకిస్థాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ ట్వీట్ చేస్తే.. హైదరాబాదీ దెబ్బకు లంకేయుల గుండె పగిలిందని ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్ర పేర్కొన్నారు. సచిన్ టెండూల్కర్ మొదలుకొని సౌరవ్ గంగూలీ, యువరాజ్ సింగ్, వీరేంద్ర సెహ్వాగ్, హర్భజన్ సింగ్, దినేశ్ కార్తీక్, ఇర్ఫాన్ పఠాన్ ఇలా ప్రతి ఒక్కరూ సిరాజ్ స్పెల్పై ప్రశంసలు కురిపించగా.. ఢిల్లీ పోలీసులు వినూత్న ట్వీట్తో వార్తల్లో నిలిచారు.
No speed challans for #Siraj today.#AsiaCupFinals#AsiaCup2023#INDvsSL
— Delhi Police (@DelhiPolice) September 17, 2023
వన్డే మ్యాచ్లో అత్యంత వేగంగా ఐదు వికెట్లు ఖాతాలో వేసుకున్న భారత బౌలర్గా రికార్డుల్లోకెక్కిన సిరాజ్కు ఈ రోజు అడ్డుకునే వారే లేరని ఢిల్లీ పోలీసులు ట్వీట్ చేశారు. ‘ఈ రోజు సిరాజ్కు స్పీడ్ చలాన్లు వర్తించవు’ అని ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. దీంతో వారి సమయస్ఫూర్తికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. అతి వేగాన్ని నియంత్రించేందుకు పలు రాష్ట్రాల పోలీసులు గతంలోనూ ఇలాంటి సందర్భాలను వినియోగించుకోగా.. తాజాగా ఢిల్లీ పోలీసుల చర్యతో సిరాజ్పై సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తున్నది.