మ్యాచ్ ప్రాక్టీస్పై పీవీ సింధు వ్యాఖ్య
న్యూఢిల్లీ: ప్రతిష్ఠాత్మక టోక్యో ఒలింపిక్స్కు ముందు అర్హత టోర్నీలు రైద్దెనా ఆ ప్రభావం తన ప్రాక్టీస్పై పడదని భారత బ్యాడ్మింటన్ స్టార్, ప్రపంచ చాంపియన్ పీవీ సింధు చెప్పింది. మహిళల సింగిల్స్ విభాగం నుంచి విశ్వక్రీడలకు అర్హత సాధించిన ఏకైక షట్లర్ అయిన సింధు.. ప్రస్తుతం కొరియన్ కోచ్ పార్క్ టే సంగ్ వద్ద శిక్షణ తీసుకుంటున్నది. ఈ నేపథ్యంలో ఆదివారం సింధు తన ప్రాక్టీస్పై స్పందిస్తూ.. ‘ఒలింపిక్స్కు ముందు సింగపూర్ ఓపెన్ చివరిదవుతుందని అనుకున్నా. కానీ కరోనా కారణంగా టోర్నీలన్నీ రద్దయ్యాయి. అయినా ప్రాక్టీస్కు ఎలాంటి ఇబ్బంది లేదు. నా కోచ్ పార్క్ టే సంగ్.. ప్రాక్టీస్ సెషన్లలోనూ మ్యాచ్లో ఉండే పరిస్థితులను కల్పిస్తున్నాడు. తై జూ యింగ్, రచనోక్ ఇంతనోన్ వంటి ప్లేయర్లను ఎలా ఎదుర్కోవాలో సూచనలిస్తున్నాడు. అతడితో మ్యాచ్లు ఆడుతూ టెక్నిక్ మెరుగు పర్చుకుంటున్నా’ అని సింధు పేర్కొంది.
ఆటల కంటే ప్రాణాలే ముఖ్యం
విశ్వక్రీడలకు ముందు గచ్చిబౌలిలోని ఇండోర్ స్టేడియంలో కోచ్తోనే ప్రాక్టీస్ చేస్తున్న సింధు.. ఆటల కంటే ప్రాణాలే ముఖ్యమని చెప్పింది. ‘కరోనా కారణంగా ప్రపంచం స్తంభించిపోయింది. ఈ సమయంలో ఆటలు ముఖ్యం కాదు. మేము క్రీడాకారులకంటే ముందు మనుషులం. మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా వైరస్ ఎక్కడి నుంచైనా రావొచ్చు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ టోర్నీల నిర్వహణ కత్తిమీద సాము వంటిదే’ అని పేర్కొంది. కొవిడ్ పరీక్షల్లో తప్పుడు నివేదికలు వస్తే అసలుకే మోసం వస్తుందని సింధు చెప్పుకొచ్చింది. గతంలో భారత స్టార్ ఆటగాళ్లు సైనా నెహ్వాల్, కిడాంబి శ్రీకాంత్ ఇలాంటి తప్పుడు రిపోర్ట్ల వల్ల నష్టపోయారని గుర్తుచేసుకుంది.