ఈ నెలలో జరగనున్న కామన్వెల్త్ క్రీడల్లో భారత బాక్సింగ్ బృందం కనీసం నాలుగు బంగారు పతకాలు సాధిస్తుందని ప్రపంచ ఛాంపియన్ నిఖత్ జరీన్ ఆశాభావం వ్యక్తం చేసింది. ఇటీవల జరిగిన ప్రపంచ మహిళల ఛాంపియన్షిప్లో విజేతగా నిలిచిన నిఖత్.. కామన్ వెల్త్ క్రీడల గురించి మాట్లాడుతూ తను చాలా పాజిటివ్గా ఉన్నట్లు తెలిపింది.
బర్మింగ్హామ్ వేదికగా జరిగే ఈ క్రీడల్లో భారత బాక్సింగ్ బృందం కనీసం 8 పతకాలు సాధిస్తుందని తను అనుకుంటున్నట్లు చెప్పింది. వీటిలో కనీసం నాలుగు బంగారు పతకాలు ఉంటాయని ఆశాభావం వ్యక్తం చేసింది. ‘‘ఈ పోటీల్లో భారత బృందం కనీసం 8 పతకాలు సాధిస్తుందని అనుకుంటున్నా. వాటిలో 4 బంగారు పతకాలు ఉంటాయనే నమ్మకం ఉంది. మన బృందంలో ప్రపంచ ఛాంపియన్షిప్, ఒలింపిక్స్ వంటి టోర్నీల్లో మెడల్స్ సాధించిన క్రీడాకారులు ఉన్నారు.. చూద్దాం ఏం జరుగుతుందో’’ అని నిఖత్ ధీమాగా మాట్లాడింది.