ప్రతిష్ఠాత్మక కామన్వెల్త్ గేమ్స్లో తెలంగాణ బాక్సర్లు నిఖత్ జరీన్, మహమ్మద్ హుసాముద్దీన్ విజయపతాక ఎగరవేశారు. ఇందూర్ పంచ్ పవర్ను ప్రత్యర్థులకు రుచిచూపిస్తూ సెమీఫైనల్లోకి దూసుకెళ్లారు. తన సూపర్ ఫామ్ కొనసాగిస్తూ నిఖత్ పదునైన పంచ్లతో విరుచుకుపడగా, హుసాముద్దీన్ ప్రత్యర్థి భరతం పట్టాడు. వీరిద్దరికి తోడు నీతు సెమీస్లోకి దూసుకెళ్లి కనీసం కాంస్య పతకాన్ని ఖాయం చేసింది. జూడోలో తులికా మన్ వెండి వెలుగులు విరజిమ్మగా, స్కాష్లో సౌరవ్ ఘోషల్ కాంస్య పతకం కొత్త చరిత్ర లిఖించాడు. హాకీలో పురుషుల, మహిళల జట్లు సెమీఫైనల్లోకి దూసుకెళ్లాయి. వెయిట్లిఫ్టింగ్లో లవ్ప్రీత్సింగ్ కాంస్యం ఒడిసిపట్టుకోగా, బ్యాడ్మింటన్ టీమ్ ఈవెంట్లో భారత్ రజత పతకంతో సరిపెట్టుకుంది. ఓవరాల్గా భారత్ ఖాతాలో బుధవారం నాలుగు పతకాలు చేరాయి.
బర్మింగ్హామ్: అంతర్జాతీయ వేదికపై తెలంగాణ పంచ్ పవర్ ఏంటో రుచిచూపించారు నిఖత్ జరీన్, మహమ్మద్ హుసాముద్దీన్. ప్రత్యర్థి ఎవరన్నది లెక్కచేయని నైజంతో గెలుపే లక్ష్యంగా పంచ్ల వర్షం కురిపించారు. కామన్వెల్త్లో ఆడుతున్నది తొలిసారే అయినా ఎలాంటి తొణుకు బెణుకు లేకుండా నిఖత్, హుసామ్ కురిపించిన పంచ్లకు ప్రత్యర్థులు మట్టికరిచారు. ప్రపంచ చాంపియన్ హోదాకు న్యాయం చేస్తూ నిఖత్ కొట్టిన పంచ్లకు వేల్స్ బాక్సర్ దగ్గర సరైన సమాధానం లేకపోయింది. తొలుత జరిగిన పురుషుల 57కిలోల క్వార్టర్స్ బౌట్లో హుసాముద్దీన్ 4-1 తేడాతో ట్రైగెన్ మార్నింగ్ డెవెలో(నమీబియా)పై అద్భుత విజయం సాధించాడు. ఆది నుంచే ఈ ఇద్దరు బాక్సర్లు ఒకరిపై ఒకరు ముష్టిఘాతాలు కురిపించుకున్నారు. అవకాశం వచ్చిన ప్రతీసారి పదునైన పంచ్లతో చెలరేగుతూ కీలక పాయింట్లు తమ ఖాతాలో వేసుకున్నారు. ముఖ్యంగా హుసామ్ క్లీన్ హుక్స్, జాబ్స్తో చెలరేగుతూ ప్రత్యర్థిపై పైచేయి సాధించాడు. ఈ క్రమంలో వరుసగా రెండోసారి కామన్వెల్త్లో పతకం ఖాయం చేసుకున్నాడు. గత కామన్వెల్త్లో కాంస్యం గెలిచిన ఈ ఇందూరు బాక్సర్..మరోమారు సెమీస్ చేరి పతకం ఒడిసిపట్టుకోబోతున్నాడు.
నిఖత్ అదుర్స్: కామన్వెల్త్లో ఈసారి కచ్చితంగా పసిడి పతకం కొడుతానని ప్రతిన బూనిన ఇందూర్ బాక్సర్ ఆ దిశగా అప్రతిహత విజయాలతో ముందుకు వెళుతున్నది. బుధవారం జరిగిన మహిళల 50 కిలోల క్వార్టర్స్ బౌట్లో నిఖత్ 5-0 తేడాతో హెలెన్ జోన్స్(వేల్స్)పై అలవోక విజయం సాధించింది. తొలి బౌట్ నుంచే తనదైన జోరు కనబరిచిన నిఖత్..జోన్స్కు ఎక్కడా అవకాశమివ్వకుండా పంచ్లతో విరుచుకుపడింది. క్లీన్ పంచ్లతో చెలరేగుతూ రౌండ్ రౌండ్కు తన ఆధిక్యాన్ని అంతకంతకూ పెంచుకుంటూ పోయింది. ఓవైపు పవర్ఫుల్ పంచ్లు సంధిస్తూనే ప్రత్యర్థి పంచ్లకు దీటుగా బదులిచ్చింది. ఈ క్రమంలో తన పసిడి పతక లక్ష్యానికి నిఖత్ మరింత చేరువైంది. మరోవైపు మహిళల 48కిలోల క్వార్టర్స్లో నీతు..నీకోల్ ైక్లెడ్(నార్తర్న్ ఐర్లాండ్)పై అద్భుత విజయం సొంతం చేసుకుంది. భివానీకి చెందిన ఈ 21 ఏండ్ల యువ బాక్సర్..రెండో రౌండలలోనే విజయాన్ని ఖాతాలో వేసుకుంది. నీతు విసిరిన పంచ్లకు ప్రత్యర్థి తాళలేక చేతులేత్తెయడంతో ఏకపక్ష విజయం ఖరారైంది. మెగాటోర్నీలో తొలిసారి ఆడుతున్నా..ఎక్కడా ఒత్తిడికి లోనుకాని..పసిడి పతకమే తన లక్ష్యమని ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. ఓవరాల్గా బా క్సింగ్లో భారత్కు ఇప్పటి వరకు మూడు పతకాలు ఖాయమయ్యాయి.