అస్తానా(కజకిస్థాన్): ప్రతిష్ఠాత్మక పారిస్ ఒలింపిక్స్కు ముందు భారత స్టార్ బాక్సర్ నిఖత్జరీన్ పసిడి పతకంతో మెరిసింది. ఎలోర్డా బాక్సింగ్ టోర్నీలో నిఖత్తో పాటు మీనాక్షి టైటిళ్లతో తళుక్కుమన్నారు. శనివారం జరిగిన మహిళల 52కిలోల ఫైనల్ బౌట్లో నిఖత్ 5-0తో జాజిర ఉర్రబయేవా(కజకిస్థాన్)పై అద్భుత విజయం సాధించింది. ఆది నుంచే తనదైన దూకుడు ప్రదర్శించిన ఈ ఇందూరు బాక్సర్ ప్రత్యర్థికి ఎక్కడా అవకాశమివ్వకుండా ముందుకు సాగింది. పదునైన పంచ్లకు తోడు జాబ్స్, హుక్స్తో రౌండ్రౌండ్కు తన ఆధిక్యాన్ని పెంచుకుంటూ పోయింది. మరోవైపు 48కిలోల తుది పోరులో మీనాక్షి 4-1తో రమనోవా సైదాహోన్(ఉజ్బెకిస్థాన్)పై గెలిచి పసిడి ఖాతాలో వేసుకుంది. మిగతా బౌట్లలో అనామిక(50కి), మనీశ(60కి) రజత పతకాలు సాధించారు. యైఫబాసింగ్, అభిషేక్, విశాల్, గౌరవ్ చాహాన్, సోను మంజు, షలకసింగ్, మోనిక కాంస్య పతకాలు కైవసం చేసుకున్నారు. మొత్తంగా భారత్ 12 పతకాలతో టోర్నీని ఘనంగా ముగించింది.