వెల్లింగ్టన్: అద్భుతం ఆవిష్కృతమైంది. సుదీర్ఘ టెస్టు క్రికెట్ చరిత్రలో కలకాలం ప్రేక్షకుల మదిలో గుర్తుండిపోయే మ్యాచ్. టెస్టు ఆట మజా ఏంటో రూచిచూపిస్తూ న్యూజిలాండ్, ఇంగ్లండ్ గెలుపు కోసం కడదాకా కొట్లాడాయి. హోరాహోరీగా సాగిన రెండో టెస్టులో కివీస్ పరుగు తేడాతో ఇంగ్లండ్పై చరిత్రాత్మక విజయం సాధించింది. కివీస్ నిర్దేశించిన 258 పరుగుల లక్ష్యఛేదనలో ఇంగ్లండ్ 256 పరుగులకు ఆలౌటైంది. ఓవర్నైట్ స్కోరు 48/1తో ఆఖరి రోజు రెండో ఇన్నింగ్స్కు దిగిన ఇంగ్లండ్ గెలుపు కోసం తుదికంటా పోరాడింది. మరోవైపు సొంతగడ్డపై సత్తాఏంటో చూపిస్తూ కివీస్ బౌలర్లు తమ ప్రతాపం చూపించడంతో మ్యాచ్ రసవత్తరంగా సాగింది. మాజీ కెప్టెన్ జోరూట్(95) ఒంటరి పోరాటం ఆ జట్టును గెలిపించలేకపోయింది.
తొలి ఇన్నింగ్స్ సెంచరీ హీరో బ్రూక్(0) పరుగుల ఖాతా తెరవకుండానే నిష్క్రమించడం ఆ జట్టు ఓటమివైపు నిలిపింది. ఓవైపు కివీస్ పకడ్బందీ బౌలింగ్తో వరుస వికెట్లు కోల్పోతున్నా.. వెనకకు తగ్గని ఇంగ్లండ్ దీటుగా పోరాడేందుకు ప్రయత్నించింది. విజయానికి రెండు పరుగులు అవసరమైన దశలో వాగ్నర్(4/62) బౌలింగ్లో అండర్సన్(4) కీపర్ క్యాచ్తో ఔట్ కావడంతో కివీస్ గెలుపు సంబురాల్లో మునిగిపోయింది. అప్పటి వరకు తమదే మ్యాచ్ అనుకున్న ఇంగ్లండ్.. ఓటమివైపు నిలిచి ఊహించని షాక్ తింది. సౌథీ (3/45), హెన్రీ (2/75) రాణించారు. అయితే తొలుత ఇంగ్లండ్ తమ మొదటి ఇన్నింగ్స్ను 435/8 వద్ద డిక్లేర్చేయగా, కివీస్ తొలి ఇన్నింగ్స్లో 209 పరుగులకే కుప్పకూలింది. ఈ క్రమంలో కివీస్ను ఫాలోఆన్కు ఆహ్వానించిన ఇంగ్లండ్ మూల్యం చెల్లించుకుంది. విలియమ్సన్ (132) సూపర్ సెంచరీతో రెండో ఇన్నింగ్స్లో 483 పరుగులు చేసిన కివీస్..ఇంగ్లండ్ ముందు 258 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. విలియమ్సన్కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ దక్కింది.