హైదరాబాద్, ఆట ప్రతినిధి: నూతన క్రీడా విధానంపై రాష్ట్ర క్రీడాశాఖ కసరత్తు చేస్తున్నది. సమగ్రమైన క్రీడా విధానానికి తుదిరూపునిచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇందులో భాగంగా బుధవారం హైదరాబాద్లో మంత్రి శ్రీనివాస్గౌడ్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘నూతన క్రీడా విధానానికి త్వరలో తుదిరూపు ఇవ్వబోతున్నాం. వచ్చే క్యాబినెట్ సమావేశం నాటికి ముసాయిదాను అధికారులు సిద్ధం చేయాలి.
ప్రతిష్ఠాత్మక టోర్నీల్లో పతకాలు సాధిస్తున్న వివిధ దేశాల క్రీడావిధానాన్ని క్షణ్ణంగా అధ్యయనం చేయాలి. అదే సమయంలో వివిధ రాష్ర్టాల్లో అమలవుతున్న అంశాలను పరిగణనలోకి తీసుకుంటూ క్యాబినెట్ సబ్కమిటీకి అందజేయాలి’ అని అన్నారు. ఈ కార్యక్రమంలో సాట్స్ చైర్మన్ ఆంజనేయగౌడ్, ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు వేణుగోపాలచారి, క్రీడాశాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్ తదితరులు పాల్గొన్నారు.