ముంబై: క్రికెట్ పసికూన నేపాల్ కొత్త చరిత్ర లిఖించింది. అంతర్జాతీయ క్రికెట్లో ఇప్పుడిప్పుడే ఓనమాలు దిద్దుతున్న నేపాల్ టీ20 ప్రపంచకప్లో తొలి విజయాన్ని ఖాతాలో వేసుకుంది. తమ ఆఖరి గ్రూపు పోరులో స్కాట్లాండ్పై 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. స్కాటిష్ టీమ్పై సమష్టి ప్రదర్శనతో సత్తాచాటారు. వందలాది మంది తమ దేశ క్రికెట్ అభిమానుల సమక్షంలో నేపాల్ అద్భుత ప్రదర్శనతో కదంతొక్కింది. తొలుత సోంపాల్(3/25), నందన్యాదవ్(2/34) ధాటికి స్కాట్లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 170/7 స్కోరు చేసింది.
ఓపెనర్ మిచెల్ జోన్స్(71) ధనాధన అర్ధసెంచరీతో చెలరేగగా, మిగతావారు అంతగా ఆకట్టుకోలేకపోయారు. లక్ష్యఛేదనలో నేపాల్ 19.2 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి విజయాన్నందుకుంది. దీపేంద్రసింగ్ ఐరీ(23 బంతుల్లో 50 నాటౌట్, 4ఫోర్లు, 3సిక్స్లు) అజేయ అర్ధసెంచరీతో అదరగొట్టాడు. ఓపెనర్లు కుశాల్(43), ఆసిఫ్ షేక్(33) మెరుగైన శుభారంభాన్ని అందించారు. ఆఖర్లో గుల్షన్(24 నాటౌట్)తో కలిసి ఐరీ..జట్టును గెలుపు తీరాలకు చేర్చాడు. ఐరీకి ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ దక్కింది.