T20 World Cup 2024 : ఒకవైపు భారత గడ్డపై వన్డే వరల్డ్ కప్ రసవత్తరంగా జరగుతుంటే.. మరోవైపు పొట్టి ప్రపంచ కప్ సన్నాహక సందడి మొదలైంది. ఇప్పటికే జట్లు టీ20 వరల్డ్ కప్కి అర్హత సాధించగా.. ప్లే ఆఫ్స్ బెర్తు కోసం ఆసియా పసికూన నేపాల్, యూఏఈ(యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్) జట్ల మధ్య గట్టి పోటీ నెలకొంది.
ఆసియా క్వాలిఫైయర్ పోటీలకు ఆతిథ్యం ఇస్తున్న నేపాల్ గ్రూప్ ‘ఏ’లో అగ్రస్థానంలో నిలవగా.. గ్రూప్ ‘బి’లో యూఏఈ జట్టు టాప్లో ఉంది. ఖాట్మండ్లోని ముల్పని క్రికెట్ గ్రౌండ్ వేదికగా జరుగనున్న సెమీ ఫైనల్లో అమీతుమీ తేల్చుకోనున్నాయి. మరో సెమీస్ పోరులో ఒమన్, బహ్రెయిన్ జట్లు పోటీ పడనున్నాయి.
వచ్చే ఏడాది పొట్టి ప్రపంచ కప్ పోటీలకు అమెరికా, వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న విషయం తెలిసిందే. ఈ టోర్నీలో మొత్తం 20 జట్లు పాల్గొననున్నాయి. ఇప్పటికే భారత్, ఆస్ట్రేలియా, నెదర్లాండ్స్, న్యూజిలాండ్, పాకిస్థాన్, దక్షిణాఫ్రికా, శ్రీలంక, అఫ్గనిస్థాన్, ఇంగ్లండ్, బంగ్లాదేశ్, ఐర్లాండ్, స్కాట్లాండ్, పపువా న్యూ గినియా జట్లు అర్హత సాధించాయి. మెగా టోర్నీకోసం అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ అమెరికా, విండీస్లో వేదికలను ఖరారు చేసింది. ఈ టోర్నీలో ఇంగ్లండ్ జట్టు డిఫెండింగ్ చాంపియన్గా బరిలోకి దిగనుంది.