వన్డే ప్రపంచకప్లో భారత్ జైత్ర యాత్ర కొనసాగుతున్నది. పరాజయమన్నది లేకుండా ప్రత్యర్థుల పనిపడుతూ సగ్వరంగా సెమీస్కు చేరింది. చరిత్రాత్మక వాంఖడే స్టేడి యంలో భారత్.. శ్రీలంకను మరో మారు చిత్తుచేసింది. గిల్, కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ అర్ధసెంచరీలతో భారత్ 357 పరుగుల భారీ స్కోరు చేసింది. అనంతరం లంకేయుల భరతం పట్టింది. షమీ, సిరాజ్, బుమ్రా నిప్పులు చెరిగిన బంతు లకు లంక బ్యాటర్లు పేక మేడలా కుప్పకూలారు. ఐదుగురు బ్యాటర్లు డకౌట్ కాగా, ఇద్దరు ఒక్క పరుగు చొప్పున చేశారు. ఫలితంగా 55 పరుగులకే చాపచుట్టేసిన లంక సెమీస్కు దూరమైంది.
ఆహా ఏమా బ్యాటింగ్.. ఏమా బౌలింగ్! ఇది కదా సమిష్టి ప్రదర్శన అంటే.. ఇది కదా సంపూర్ణ ఆధిపత్యం అంటే! ఆడిన ఏడు మ్యాచ్ల్లోనూ జయకేతనం ఎగరేసిన టీమ్ఇండియా.. తాజా ప్రపంచకప్లో సెమీఫైనల్ చేరిన తొలి జట్టుగా నిలిచింది.
బ్యాటింగ్లో విరాట్ కోహ్లీ, శుభ్మన్ గిల్ నిలకడకు శ్రేయస్ అయ్యర్ మెరుపులు తోడవడంతో టీమ్ఇండియా కొండంత స్కోరు చేస్తే.. బౌలింగ్లో మన పేసర్లు వాంఖడేను వాకాగా మారుస్తూ నిప్పులు కురిపించారు. షమీ, సిరాజ్ ధాటికి పరుగులు చేయడం పక్కన పెట్టి అసలు క్రీజులో ఎలా నిల్చోవాలో కూడా తెలియక తెల్లమొఖాలేసిన లంకేయులు.. ఆరో పరాజయంతో నాకౌట్ రేసు నుంచి నిష్క్రమించారు!
ముంబై: వన్డే ప్రపంచకప్లో టీమ్ఇండియా అప్రతిహత విజయాల పరంపర కొనసాగుతున్నది. ప్రత్యర్థితో సంబంధం లేకుండా దూసుకెళ్తున్న రోహిత్ సేన స్వదేశంలో జరుగుతున్న మెగాటోర్నీలో వరుసగా ఏడో విజయం సాధించింది. గురువారం ముంబై వాంఖడే స్టేడియంలో జరిగిన పూర్తి ఏకపక్ష పోరులో భారత్ 302 పరుగుల తేడాతో శ్రీలంకను చిత్తు చేసింది. ఇప్పటి వరకు ఈ టోర్నీలో ఆడిన ఏడు మ్యాచ్ల్లోనూ విజయాలు సాధించిన రోహిత్ సేన 14 పాయింట్లతో అందరికంటే ముందు సెమీఫైనల్లో అడుగుపెట్టింది. అదే సమయంలో ఏడు మ్యాచ్ల్లో ఐదు పరాజయాలతో శ్రీలంక సెమీస్ రేసుకు దూరమైంది. మొదట భారత్ 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 357 పరుగులు చేసింది.
గిల్ (92 బంతుల్లో 92; 11 ఫోర్లు, 2 సిక్సర్లు), కోహ్లీ (94 బంతుల్లో 88; 11 ఫోర్లు), శ్రేయస్ (56 బంతుల్లో 82; 3 ఫోర్లు, 6 సిక్సర్లు) అర్ధశతకాలతో రాణించారు. కెప్టెన్ రోహిత్ శర్మ (4) విఫలం కాగా.. ఆఖర్లో రవీంద్ర జడేజా (24 బంతుల్లో 35; ఒక ఫోర్, ఒక సిక్సర్) విలువైన పరుగులు జోడించాడు. లంక బౌలర్లలో మధుషనక 5 వికెట్లు పడగొట్టాడు. అనంతరం లక్ష్యఛేదనలో శ్రీలంక 19.4 ఓవర్లలో 55 పరుగులకు ఆలౌటైంది. కసున్ రజిత (14), తీక్షణ (12 నాటౌట్), మాథ్యూస్ (12) మాత్రమే రెండంకెల స్కోరు చేయగా.. మిగిలిన వాళ్లంతా సింగిల్ డిజిట్కే పరిమితమయ్యారు. అందులో ఐదుగురు డకౌట్ కావడం గమనార్హం. భారత బౌలర్లలో మహమ్మద్ షమీ 5, సిరాజ్ మూడు వికెట్లు పడగొట్టారు. లంక ప్లేయర్లకు నిద్రలేని రాత్రులు మిగిల్చిన షమీకి ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. భారత్ తదుపరి మ్యాచ్లో ఆదివారం దక్షిణాఫ్రికాతో తలపడనుంది.
బ్యాటింగ్కు సహకరిస్తున్న పిచ్పై టాస్ గెలిచిన శ్రీలంక కెప్టెన్ కుషాల్ మెండిస్ టీమ్ఇండియాను బ్యాటింగ్కు ఆహ్వానించాడు. సొంత మైదానంలో తొలి బంతికే బౌండ్రీ బాది ఖాతా తెరిచిన రోహిత్ రెండో బంతికి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో లంక సారథి ఆలోచన సరైందే అన్నట్లు అనిపించినా.. ఆ తర్వాత గిల్, కోహ్లీ ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు. మంచి బంతులను గౌరవించిన ఈ జోడీ.. చెత్త బంతి పడితే చాలు దాన్ని బౌండ్రీకి తరలించారు. ఈ క్రమంలో లంక ఫీల్డర్ల తప్పిదాలు కూడా టీమ్ఇండియాకు కలిసొచ్చాయి.
ఇన్నింగ్స్ ఆరంభంలోనే కోహ్లీ, గిల్ ఇచ్చిన సులువైన క్యాచ్లను వదిలేశారు. ఈ క్రమంలో మొదట విరాట్ 50 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసుకోగా.. కాసేపటికే గిల్ (55 బంతుల్లో) ఆ మార్క్ దాటాడు. ఇక అక్కడి నుంచి గేర్లు మార్చిన వీరిద్దరూ వేగంగా పరుగులు రాబట్టారు. ముఖ్యంగా గిల్ సిక్సర్లతో రెచ్చిపోయాడు. ఇక ఇద్దరి శతకాలు ఖాయమే అనుకుంటే.. మరోసారి మధుషనక దెబ్బకొట్టాడు. 30వ ఓవర్లో గిల్ను ఔట్ చేసిన అతడు.. తన తదుపరి ఓవర్లో కోహ్లీని బలి తీసుకున్నాడు. సచిన్ టెండూల్కర్ సమక్షంలో వన్డేల్లో మాస్టర్ అత్యధిక సెంచరీల (49) రికార్డును సమం చేయాలనుకున్న కోహ్లీ.. శతకానికి పన్నెండు పరుగుల దూరంలో నిష్క్రమించాడు. అయినా చివర్లో శ్రేయస్ చెలరేగడంతో భారత్ భారీ స్కోరు చేసింది.
జట్టులో చోటు సందిగ్ధంలో పడ్డ సమయంలో శ్రేయస్ అయ్యర్ బ్యాట్ నుంచి ఆణిముత్యంలాంటి ఇన్నింగ్స్ జాలువారింది. మంచి టచ్లో ఉన్న బ్యాటర్లు ఔటైన సమయంలో క్రీజులో అడుగుపెట్టిన శ్రేయస్.. వాంఖడేను ఉర్రూతలూగించాడు. ఫోర్ల కంటే సిక్సర్లు కొట్టడమే తేలిక అన్నట్లు లంకేయులను ఊచకోత కోశాడు. కేఎల్ రాహుల్ (21), సూర్యకుమార్ యాదవ్ (12) ఎక్కువ సేపు నిలువలేకపోయినా.. అందిన బంతిని అందినట్లు స్టాండ్స్లో పడేశాడు. కసున్ రజిత వేసిన 36వ ఓవర్లో అయ్యర్ కొట్టిన బంతి 106 మీటర్ల దూరం వెళ్లింది. తాజా వరల్డ్కప్లో ఇదే అతిపెద్ద సిక్స్ కావడం గమనార్హం. ఈ ఊపులో శ్రేయస్ సెంచరీ ఖాయం అనిపించినా.. మరో భారీ షాట్ ఆడే ప్రయత్నంలో అతడు వికెట్ కోల్పోగా.. ఆల్రౌండర్ రవీంద్ర జడేజా ఆఖర్లో తన విలువ చాటుకున్నాడు.
దిన దిన గండం నూరేండ్ల ఆయుష్షు అన్నట్లు.. బంతిని టచ్ చేస్తే క్యాచ్.. వదిలేస్తే బౌల్డ్ ఇలా సాగింది శ్రీలంక ఇన్నింగ్స్! దేన్ని వదిలేయాలో దేన్ని ఆడాలో అని నిర్ణయించుకునేలోపే లంక ప్యాకప్ అయిపోయింది. కొండంత లక్ష్యఛేదనలో ఇన్నింగ్స్ తొలి బంతికే బుమ్రా వికెట్ల పతనానికి నాంది పలికితే.. ఆ తర్వాత సిరాజ్, షమీ రెచ్చిపోయారు. అసలైతే మన పేసర్ల ప్రతాపానికి రెచ్చిపోయారు అనడం చాలా చిన్న పదమే అవుతుంది! మెగాటోర్నీలో స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతున్నాడనే విమర్శలు ఎదుర్కొంటున్న ‘చార్మినార్ ఎక్స్ప్రెస్’ సిరాజ్.. తన తొలి బంతికే దిముత్ కరుణరత్నెను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. లంక ఓపెనర్ రివ్యూ తీసుకున్నా ఫలితం లేకపోయింది. ఇక అదే ఓవర్ ఐదో బంతికి సదీర సమరవిక్రమ స్లిప్లో దొరికిపోయాడు.
అప్పటికే రెండు వికెట్లు పడి ఒత్తిడిలో ఉన్న లంకను.. కెప్టెన్ రోహిత్ మరింత ఒత్తిడిలోకి నెట్టాడు. ఇటు వైపు సిరాజ్ గంటకు 140 కిలోమీటర్లకు పైగా వేగంతో బంతులు విసురుతుంటే.. టెస్టు మ్యాచ్ తరహాలో ఏకంగా మూడు స్లిప్లు పెట్టాడు. దీంతో తీవ్ర ఒత్తిడికి లోనైన సమరవిక్రమ.. థర్డ్ స్లిప్ చేతికి చిక్కి భారంగా పెవిలియన్ బాట పట్టాడు. ఫలితంగా రెండు ఓవర్లు ముగిసేసరికి లంక బ్యాట్తో పరుగులేమీ చేయకుండానే మూడు వికెట్లు కోల్పోయింది. తన తదుపరి ఓవర్ తొలి బంతికి లంక కెప్టెన్ కుషాల్ మెండిస్ను సైతం సిరాజ్ బలిగొన్నాడు. హైదరాబాదీ చేతి నుంచి బుల్లెట్ వేగంతో వచ్చిన బంతి కుషాల్ ఆఫ్స్టంప్ను గిరాటేసింది. అసలు భారత బౌలర్లను ఎలా ఎదుర్కోవాలో తేల్చుకోలేక సతమతమవుతున్న లంకకు అభిమానుల హోరు మరింత ఇబ్బంది పెట్టింది.
మైదానంలో ఉన్న పదకొండు మంది భారత ప్లేయర్లతో పాటు.. వేలాది మంది అభిమానులు ఒక్కో బంతికి అప్పీల్ చేస్తుంటే.. వాంఖడే మోతెక్కిపోయింది. ఆ తర్వాత వికెట్ల పతనానికి కాస్త బ్రేక్ పడగా.. ఈ టోర్నీలో ఆలస్యంగా తుది జట్టులో చోటు దక్కించుకున్న మహమ్మద్ షమీ తన విలువేంటో మరోసారి నిరూపించుకున్నాడు. న్యూజిలాండ్, ఇంగ్లండ్ బ్యాటర్లను చెడుగుడాడుకున్న షమీ ముందు లంక ప్లేయర్లు గల్లీ కుర్రాళ్లలా కనిపించారు. 10వ ఓవర్లో బౌలింగ్కు వచ్చిన షమీ వరుస బంతుల్లో అసలంక, హేమంతను ఔట్ చేశాడు. ఫలితంగా లంకేయుల పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్లు అయింది. అప్పటి దాక సిరాజ్ ఒక్కడే సతాయిస్తున్నాడనుకుంటే.. అతడికి షమీ తోడవడంతో అగ్నికి ఆజ్యం పోసినైట్లెంది. వీరిద్దరి చేతిలో నుంచి బంతి రావడం.. లంక బ్యాటర్లు వణికిపోవడం పరిపాటిగా మారింది.
ఇటీవల ఆసియాకప్, అంతకుముందు వన్డే సిరీస్లో లంకను తన బౌలింగ్తో బెంబేలెత్తించిన సిరాజ్ ఈ సారి కూడా అదే జోష్ చూపాడు. షమీ వేసిన లెగ్సైడ్ బంతిని అనవసరంగా ఆడిన చమీర కీపర్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరగగా.. ఏంజెలో మాథ్యూస్ క్లీన్ బౌల్డయ్యాడు. షమీ వేసిన ఇన్స్వింగర్కు లంక ఆల్రౌండర్ వికెట్లు చెల్లచెదురైన సీన్ చూసి తీరాల్సిందే! దీంతో 29 పరుగులకే ఎనిమిది వికెట్లు కోల్పోయిన లంక వన్డే క్రికెట్ చరిత్రలో అత్యల్ప స్కోరు రికార్డును చెరిపేస్తుందేమో అనిపించినా.. చివర్లో రజిత, తీక్షణ కాసిన్ని పరుగులు చేసి గండం గట్టెక్కించారు. ఈ మ్యాచ్లో లంకకు మిగిలిందంటూ ఏదైనా ఉందంటే అది బౌలింగ్లో మధుషనక ఐదు వికెట్లు పడగొట్టడం.. బ్యాటింగ్లో అత్యల్ప స్కోరును అధిగమించడం అంతే. అంతకుమించి మరేం లేదు!
– నమస్తే తెలంగాణ క్రీడావిభాగం
ప్రపంచకప్లో భారత్ సెమీస్ చేరడం ఇది ఎనిమిదోసారి.
వరుసగా మూడు మ్యాచ్ల్లో నాలుగుకంటే ఎక్కువ వికెట్లు పడగొట్టడం షమీకి ఇది రెండోసారి. 2019 వన్డే ప్రపంచకప్లో వరుసగా 4/40, 4/16, 5/69 గణాంకాలు నమోదు చేసుకున్న షమీ.. ఇప్పుడు తాజాగా ఆడిన మూడు మ్యాచ్ల్లో 5/54, 4/22, 5/18 ప్రదర్శన కనబర్చాడు. ఇలా వరుసగా మూడు మ్యాచ్ల్లో నాలుగుకంటేఎక్కువ వికెట్లు మూడుసార్లు పడగొట్టిన వకార్ యూనిస్ అగ్రస్థానంలో ఉండగా.. షమీ రెండో ప్లేస్లో నిలిచాడు.
ప్రపంచకప్లో భారత్ తరఫున అత్యధిక (45) వికెట్లు తీసిన బౌలర్గా షమీ రికార్డుల్లోకెక్కాడు. జహీర్ ఖాన్, జవగళ్ శ్రీనాథ్ (44) ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నారు.
వన్డే ప్రపంచకప్లో అత్యధిక (3) సార్లు ఐదు వికెట్ల ప్రదర్శన చేసిన బౌలర్గా స్టార్క్ను షమీ సమం చేశాడు. భారత్ తరఫున ఇదే అత్యధికం.
వన్డే ప్రపంచకప్లో పరుగుల తేడా పరంగా భారత్కు ఇదే (302) అతిపెద్ద విజయం. ఓవరాల్గా రెండోది. ఈ ఏడాది త్రివేండ్రం వేదికగా లంకతో జరిగిన పోరులో టీమ్ఇండియా 317 పరుగుల తేడాతో గెలిచింది.
వన్డేల్లో భారత్ తరఫున అత్యధిక (4) సార్లు ఐదు వికెట్లు పడగొట్టిన బౌలర్గా షమీ నిలిచాడు. జవగళ్ శ్రీనాథ్ (3)ను వెనక్కి నెట్టాడు.
ఒకే క్యాలెండర్ ఇయర్లో అత్యధిక సార్లు (8) వెయ్యి పరుగులు చేసిన ప్లేయర్గా విరాట్ కోహ్లీ రికార్డుల్లోకెక్కాడు. సచిన్ (7)ను అధిగమించాడు.
వన్డేల్లో శ్రీలంకకు ఇది (55) మూడో అత్యల్ప స్కోరు. 2012లో దక్షిణాఫ్రికా చేతిలో 43 పరుగులే చేసిన లంక.. ఇటీవల ఆసియాకప్ ఫైనల్లో టీమ్ఇండియా చేతిలో 50 పరుగులకు కుప్పకూలింది. వరల్డ్కప్లో లంకకు ఇదే అత్యల్పం.
భారత్: 50 ఓవర్లలో 357/8 (గిల్ 92, కోహ్లీ 88; మధుషనక 5/80),
శ్రీలంక: 19.4 ఓవర్లలో 55 ఆలౌట్ (కసున్ రజిత 14; షమీ 5/18, సిరాజ్ 3/16).