ఇంగ్లండ్తో మూడో టెస్టుకు భారత్ సర్వ సన్నద్ధమవుతున్నది. ఐదు మ్యాచ్ల సుదీర్ఘ టెస్టు సిరీస్లో చెరో మ్యాచ్ గెలిచిన నేపథ్యంలో రాజ్కోట్ టెస్టు కీలకం కానుంది. విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ లాంటి స్టార్ క్రికెటర్ల గైర్హాజరీలో యువ క్రికెటర్లు ధృవ్ జురెల్, సర్ఫరాజ్ఖాన్ అరంగేట్రం అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు. దేశవాళీ టోర్నీల్లో టన్నుల కొద్ది పరుగులు కొల్లగొడుతున్న ఈ యువ బ్యాటర్లు ఇంగ్లండ్పై దుమ్మురేపాలని చూస్తున్నారు. అన్నీ కలిసి వస్తే..రాజ్కోట్ టెస్టులో యువ క్రికెటర్ల అరంగేట్రానికి తలుపులు తెరుచుకోవచ్చు. మరోవైపు ఇంగ్లండ్..బజ్బాల్ వ్యూహంతో టీమ్ఇండియాను ఇబ్బంది పెట్టేందుకు అడుగులు వేస్తున్నది.
రాజ్కోట్: భారత్, ఇంగ్లండ్ మూడో టెస్టు మ్యాచ్కు రాజ్కోట్ సిద్ధమైంది. ఐదు మ్యాచ్ల సిరీస్లో చెరో మ్యాచ్ గెలిచి సిరీస్ 1-1తో సమంగా ఉన్న నేపథ్యంలో మిగిలిన మూడు మ్యాచ్లు కీలకంగా మారనున్నాయి. విశాఖపట్నం టెస్టు తర్వాత దొరికిన విశ్రాంతిని తమకు అనుకూలంగా మలుచుకున్న ఇరు జట్ల క్రికెటర్లు మంగళవారం నుంచి ప్రాక్టీస్లో మునిగి తేలారు. ఎలాగైనా ఆధిక్యం సాధించాలన్న పట్టుదలతో కనిపిస్తున్న భారత్, ఇంగ్లండ్ అందుకు తగ్గట్లు పక్కా ప్రణాళికతో ముందుకు వెళుతున్నాయి. పిచ్ స్పిన్కు అనుకూలించే అవకాశమున్న నేపథ్యంలో మరోమారు ఆసక్తిపోరుకు ఆస్కారముంది. సొంతగడ్డపై తమదే పైచేయి అనుకున్న టీమ్ఇండియాకు ఇంగ్లండ్ బజ్బాల్ వ్యూహంతో దీటైన పోటీనిస్తున్నది. దీనికి తోడు స్టార్ క్రికెటర్లు విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ లేకపోవడం టీమ్ఇండియాను ఇబ్బందులకు గురి చేస్తున్నది.
దీంతో దేశవాళీ టోర్నీల్లో నిలకడగా రాణిస్తున్న రజత్ పాటిదార్, సర్ఫరాజ్ఖాన్, ధృవ్ జురెల్, దేవదత్ పడిక్కల్ లాంటి యువ క్రికెటర్లు అవకాశం ఎదురుచూస్తున్నారు. సీనియర్ల గైర్హాజరీలో సత్తాచాటేందుకు తహతహలాడుతున్నారు. ఇప్పటికే విశాఖ టెస్టు ద్వారా రజత్ పాటిదార్ అరంగేట్రం చేయగా, రాజ్కోట్ టెస్టులో ధృవ్ జురేల్, సర్ఫరాజ్ఖాన్ తుది జట్టులోకి వచ్చే అవకాశముంది. దీంతో జట్టు అనుభవజ్ఞులైన రోహిత్శర్మ, బుమ్రా, జడేజాతో కలిసి యువ క్రికెటర్లు బరిలోకి దిగనున్నారు. మంగళవారం ఆప్షనల్ ప్రాక్టీస్ సెషన్కు శుభ్మన్ గిల్ హాజరుకాలేదు. విశాఖ టెస్టులో గాయపడ్డ గిల్..ఇంకా పూర్తిగా కోలుకోలేదని తెలిసింది.
ఇదిలా ఉంటే జట్టులో చోటు ఆశిస్తున్న ధృవ్ జురెల్, సర్ఫరాజ్ చాలాసేపు మైదానంలో గడిపారు. స్లిప్లో క్యాచ్లు ప్రాక్టీస్ చేయడంతో పాటు సుదీర్ఘంగా నెట్స్లో బ్యాటింగ్ చేస్తూ కనిపించారు. మరోవైపు మైదానంలోకి వచ్చి రావడంతోనే కోచ్ రాహుల్ ద్రవిడ్తో కలిసి కెప్టెన్ రోహిత్శర్మ పిచ్ను సమగ్రంగా పరిశీలించాడు. మ్యాచ్కు మరో రోజే మిగిలున్న నేపథ్యంలో పిచ్ స్పిన్కు సహకరిస్తుందా లేక బ్యాటింగ్కు ఆ అన్నదానిపై కోచ్తో కలిసి రోహిత్ సమాలోచనలు చేశాడు. ఆ తర్వాత క్యాచింగ్ ప్రాక్టీస్తో పాటు బ్యాటింగ్ చేశాడు. వైస్ కెప్టెన్ బుమ్రా మంగళవారం జట్టుతో చేరాడు. గాయం నుంచి కోలుకుంటున్న ఆల్రౌండర్ జడేజా..తుది జట్టులోకి వస్తాడా అన్నది ప్రశ్నగా మారింది. పిచ్పై పూర్తి అవగాహన ఉన్న ఈ లోకల్ బాయ్ చేరికతో టీమ్ఇండియాకు మరింత బలం చేకూరనుంది.